Read also:
అమరావతి: స్థానిక ఎన్నికల నిర్వహణపై ఏపీ హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. మంగళవారం నుంచి మూడు రోజుల లోపు ప్రిన్సిపల్ సెక్రటరీ స్థాయి అధికారులు రాష్ట్ర ఎన్నికల అధికారి నిమ్మగడ్డను కలవాలని ఆదేశించింది. ప్రభుత్వ అభిప్రాయాన్ని వివరించి చెప్పాలని స్పష్టం చేసింది. చర్చలు జరపాలని గతంలోనే ఆదేశాలు ఇచ్చిన న్యాయస్థానం.. ఈసారి మూడు రోజుల డెడ్లైన్ విధించింది.
కాగా స్థానిక ఎన్నికలపై ప్రభుత్వ పిటిషన్ను హైకోర్టు డిస్పోజ్ చేసింది. గతంలో ఇచ్చిన ఆదేశాలను వెల్లడించింది. ఎస్ఈసీతో చర్చల ప్రక్రియను ప్రారంభించాలని ఆదేశించింది. హైకోర్టు ఆర్డర్ కాపీ అందిన వెంటనే మూడు రోజులలోపు ముగ్గురు అధికారులను ఎన్నికల కమిషన్ వద్దకు పంపాలని, ఇందుకోసం ఎన్నికల కమిషన్ వేదికను నిర్ణయించాలని ధర్మాసనం పేర్కొంది. ప్రభుత్వం తమ అభ్యంతరాలను కమిషనర్ దృష్టికి తీసుకెళ్లాలంది. అలాగే ఇంతవేగంగా స్థానిక ఎన్నికలు నిర్వహించాల్సిన విషయంపై..ఎన్నికల కమిషన్ ప్రభుత్వానికి వివరించాలని సూచించింది. కోర్టు ఉత్తర్వులు ఈ సాయంత్రం లేదా బుధవారం ఉదయం వెలువడే అవకాశం ఉంది.