Read also:
- ఆంక్షల సుడిలో అమ్మఒడి తల్లుల పథకాలకు ఎసరు రెండో విడతలో సవాలక్ష షరతులు
- లబ్ధికి దూరంకానున్న లక్షలాది తల్లులు
- పథకానికి తెల్లరేషన్ కార్డుతో లింకు
- అయితే, ఇటీవలే 8లక్షల కార్డులు కట్
- ఆ మేరకు ‘ఒడి’కి భారీగా కోత
- ఆగస్టు 31 నాటికి విద్యార్థికి ఐదేళ్లు
- లేదంటే వారి తల్లులకు సాయం లేనట్టే
- డిసెంబరు19నాటికి ఆధార్ లేకుంటే కోత
- రూ.కోట్ల మేర భారం తగ్గించుకునే ప్లాన్
- దానికోసం లబ్ధిదారుల సంఖ్య కుదింపు
అమ్మకు అందించే సాయంపై సవాలక్ష ఆంక్షలు! అది చేతికి అందేలోపే ఎన్నెన్నో వేట్లు! సాయం ఎగ్గొట్టడానికి మరెన్నో కప్పదాట్లు! రెండో విడత అమ్మఒడి లబ్ధిదారులను సర్కారు ఖరారు చేస్తోంది. ఈ పథకంలో చేరాలంటే తెల్ల రేషన్కార్డు తప్పనిసరి. అయితే, ఇటీవల ఒకేసారి ఎనిమిది లక్షలకుపైగా కార్డులను తొలగించేశారు. ఈ మేరకు ‘ఒడి’కి కోతవేసినట్టే! ఒకటి నుంచి ఇంటర్ దాకా వర్తించే ఈ పథకంలో.. ఇంకా అడ్మిషన్లే పూర్తికాని జూనియర్ ఇంటర్ విద్యార్థుల తల్లులను ఎలా భాగం చేస్తారో తెలియదు! వీళ్లందరినీ కలుపుకొంటే అమ్మలపై పెట్టే ఖర్చు రెండోవిడతలో మరింత తగ్గిపోయినట్టే! మరోవైపు తల్లుల పథకానికి ఇవ్వాల్సిన నిధులనూ రాష్ట్ర ప్రభుత్వం తొక్కిపెడుతోంది. తొలి కాన్పు సమయంలో పీఎంఎంవీవై, జేఎ్సవై పథకాల కింద ప్రతి తల్లికీ కేంద్రం, రాష్ట్రం కలిసి రూ.ఆరువేలు అందించాలి. అయితే, ఈ పథకానికి చేర్చాల్సిన తన వాటా నిధులు ఇవ్వకపోగా, కేంద్రం ఇచ్చినవాటినీ పూర్తిగా ఖాతాలకు రాష్ట్ర ప్రభుత్వం జమచేయడం లేదు. దీంతో లక్ష మంది దరఖాస్తు చేసుకొంటే ఇప్పటికి 26 వేలమందికే సాయం చేరింది. ఇంకా దారుణంగా..రాష్ట్ర పథకం ‘ఆరోగ్య ఆసరా’ కోసం కేంద్ర పథకం ‘జేఎ్సవై’ నుంచీ కొన్ని నిధులను జగన్ ప్రభుత్వం వాడేసుకొంటోంది!
అమ్మఒడి పథకం ఆంక్షల సుడిలో చిక్కుకుంది. లబ్ధిదారుల సంఖ్యను భారీగా తగ్గించడమే ఏకైక ఎజెండాగా రాష్ట్ర సర్కారు ఈ పథకం రెండో విడతకు పలు షరతులు విధించింది. తెల్లరేషన్ కార్డుల రద్దు, ఒకటో తరగతిలో చేరే విద్యార్థి వయసు నిబంధన, ఆధార్ నంబరు తదితర నిబంధనలతో రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది తల్లులు రూ.15వేల సాయానికి దూరం కానున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థల్లో ఒకటో తరగతి నుంచి ఇంటర్ వరకూ చదువుతున్న విద్యార్థుల తల్లులకు జనవరి 9న ‘అమ్మఒడి’ సాయం అందిస్తామంటున్న సర్కారు అడుగడుగునా షరతులు పెట్టి రూ.కోట్లలో చెల్లింపుల భారం తగ్గించుకునేందుకు చర్యలు చేపట్టిందన్న విమర్శలొస్తున్నాయి.
తెల్లకార్డుల రద్దు ప్రభావం
ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 8.43 లక్షల తెల్లరేషన్ కార్డులను తాజాగా రద్దు చేసింది. వీటి స్థానంలో కొందరికి రైస్ కార్డులు మంజూరు చేసింది. కార్డుల రద్దు కారణంగా దాదాపు 4-5 లక్షల మంది తల్లులకు ఈ పథకానికి దూరమయ్యే పరిస్థితి ఏర్పడింది.
విద్యార్థి వయసుతో లింకు
ఈ ఏడాది ఒకటో తరగతిలో చేరిన చిన్నారుల వయసుకు ‘అమ్మఒడి’ సాయానికీ లింకు పెట్టారు. ఐదేళ్ల నిబంధన కారణంగా వేలాది మంది తల్లులకు అర్హత లేకుండా పోతుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ‘నాడు-నేడు’ కింద ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నారని, అమ్మఒడి కింద రూ.15 వేలతో పాటు జగనన్న విద్యాకానుక కిట్లు ఇస్తారన్న ఆశతో ఎంతోమంది తల్లులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించారు. వీరి వివరాలు చైల్డ్ ఇన్ఫో డేటాలో నమోదు చేశారు. ఈ ఏడాది ఆగస్టు 31నాటికి ఐదేళ్ల వయసు నిండి ఒకటో తరగతిలో చేరిన పిల్లల నుంచి మాత్రమే ఈ పథకానికి అర్హులైన తల్లుల సంఖ్యను తేల్చేందుకు ప్రామాణికంగా నిర్దేశించారు.
పూర్తికాని ఇంటర్ అడ్మిషన్లు
ప్రస్తుత విద్యా సంవత్సరంలో జూనియర్ ఇంటర్ అడ్మిషన్లు ఎప్పటికి పూర్తవుతాయో తెలియని పరిస్థితి నెలకొంది. ఈసారి ఆన్లైన్ అడ్మిషన్లు చేపడతామని, జూనియర్ కాలేజీల్లో సెక్షన్లు, సీట్ల సంఖ్య తగ్గిస్తూ ఇంటర్ బోర్డు నిర్ణయం తీసుకోవడంపై న్యాయ వివాదం ఏర్పడింది. అమ్మఒడిని పొందేందుకు ఇంటర్ ఫస్టియర్ చదువుతున్న విద్యార్థుల తల్లులు కూడా అర్హులే. కానీ అడ్మిషన్లు చేపట్టని కారణంగా వారికి ఈ పథకం ఎలా ఇస్తారో స్పష్టత లేదు.
వలస కార్మికులకు ఇబ్బందే
కరోనా కారణంగా ఇతర రాష్ట్రాల నుంచి వేలాది మంది కార్మికులు తిరిగొచ్చారు. వారి పిల్లలను సమీప పాఠశాలల్లో ఒకటో తరగతిలో చేర్పించారు. వారికి వయసు నిబంధనపై అవగాహన లేదు. ప్రభుత్వం విధించిన ఆంక్షల కారణంగా ఆ తల్లులకు ఆర్థిక సహాయం దక్కకుండా పోయే పరిస్థితి ఏర్పడింది.
తాజా నిబంధనలు ఇలా
- ఆగస్టు 31నాటికి ఐదేళ్లు నిండని ఒకటో తరగతి పిల్లల తల్లులకు సాయం అందదు.
- డిసెంబరు 19నాటికి తల్లి, విద్యార్థికి ఆధార్ నంబరు లేకపోయినా పథకం వర్తించదు. ఇదే సమయానికి తెల్ల రేషన్కార్డు/ రైస్ కార్డు లేకపోయినా, కార్డు హోల్డ్/ఇన్యాక్టివ్లో ఉన్నా అర్హత ఉండదు.
- నాలుగు చక్రాల వాహనం కుటుంబంలో ఎవరి పేరున ఉన్నా సరే లబ్ధి చేకూరదు.
- నిర్దేశించిన పొలం కన్నా ఎక్కువ ఉన్నా, గతంలో ఆదాయపు పన్ను రిటర్నులు వేసినా,గత 6నెలల్లో నిర్దేశించిన మొత్తం కంటే ఎక్కువ కరెంట్ బిల్లు చెల్లించినా ‘అమ్మఒడి’ చెల్లింపులు ఉండవు.
- ఒక తల్లి తన ఇద్దరు పిల్లలకు వేర్వేరు అకౌంట్ నంబర్లు ఇచ్చినా, బ్యాంక్ ఖాతా మనుగడలో లేకపోయినా పథకం వర్తించదు.
- కుటుంబంలో గవర్నమెంట్ పింఛను/ జీతం (సీఎ్ఫఎంఎస్ ద్వారా) పొందుతున్నవారు ఈ పథకం లబ్ధి పొందడానికి అనర్హులు.