అమరావతి: పరిమిత పోస్టులతో డీఎస్సీ నిర్వహణకు పాఠశాల విద్యాశాఖ ఖాళీల వివరాలను కోరింది. డీఎస్సీ-2018లో మిగిలిన బీసీ, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగుల ఖాళీలను పంపించాలని సూచించింది. కొన్నేళ్లుగా మిగిలిన బ్యాక్లాగ్ పోస్టుల భర్తీకి ప్రత్యేక డీఎస్సీ నిర్వహించనున్నారు. ఇప్పటికే ఈ నియామకాలకు ప్రభుత్వం అనుమతి తెలిపింది. జనవరిలో ఇతర పోటీ పరీక్షలు ఉండటంతో డీఎస్సీని ఆన్లైన్ ద్వారా ఫిబ్రవరిలో నిర్వహించనున్నారు. ఈ మేరకు ఆన్లైన్ పరీక్ష కోసం సాంకేతిక పరిజ్ఞానం అందించే సంస్థ స్లాట్(సమయం) ఇచ్చింది. ఈలోపు ఖాళీల సేకరణ, దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ పూర్తి చేయనున్నారు. టెట్తో సంబంధం లేకుండా డీఎస్సీ నిర్వహించాలని అధికారులు భావిస్తున్నారు.
టెట్లో జాప్యం: ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్) నిర్వహణలో కొంత జాప్యం చోటుచేసుకునే అవకాశం ఉంది. ఈసారి పాఠ్యప్రణాళికను మారుస్తున్నారు. ఈ బాధ్యతను రాష్ట్ర విద్య పరిశోధన, శిక్షణ మండలికి అప్పగించారు. మరో వారంలో పాఠ్యప్రణాళిక ఖరారయ్యే అవకాశం ఉంది. అనంతరం ప్రభుత్వ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్లో పరీక్ష నిర్వహణకు సహకారం అందించే ప్రైవేటు సంస్థ స్లాట్లు ఖాళీ లేకపోవడంతో మార్చి, ఏప్రిల్లో నిర్వహించవచ్చు.