నెలాఖరులోగా ఈపీఎఫ్ వడ్డీ జమ-8.5 శాతం చొప్పున ఏకమొత్తంగా వేయాలని నిర్ణయం
ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్వో) 2019-20 సంవత్సరానికి సంబంధించి ఆరు కోట్ల మంది చందాదారుల ఖాతాల్లో ఈ నెలాఖరు కల్లా 8.5 శాతం వడ్డీని ఏకమొత్తంగా జమచేయనుంది. వాస్తవానికి కేంద్ర కార్మిక శాఖ మంత్రి సంతోష్ గాంగ్వర్ అధ్యక్షతన ఈ ఏడాది సెప్టెంబరులో జరిగిన ఈపీఎఫ్వో ధర్మకర్తల మండలి భేటీలో 8.5% వడ్డీని 8.15 శాతం, 0.35 శాతం (రెండు వాయిదాలుగా) విభజించి జమచేయాలని నిర్ణయించారు. తాజాగా పరిస్థితులు కాస్త కుదుట పడడంతో ఒకేసారి చెల్లించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ మేరకు 8.5శాతం వడ్డీని జమచేసేందుకు అనుమతించాలని కోరుతూ.. ఈ నెల ప్రారంభంలో కార్మిక మంత్రిత్వశాఖ నుంచి ఆర్థిక శాఖకు ప్రతిపాదనలు వెళ్లాయి. ఈ ప్రతిపాదనలపై ఆర్థిక శాఖ నుంచి కొద్ది రోజుల్లోనే సమ్మతి లభించే అవకాశాలు ఉన్నట్లు విశ్వసనీయవర్గాలు తెలిపాయి. వాస్తవానికి చందాదారులకు 8.5 శాతం వడ్డీ చెల్లించడానికి కొన్ని ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్(ఈటీఎఫ్)లను విక్రయించాలని ఈపీఎఫ్వో గతంలో నిర్ణయించింది. కొవిడ్-19 లాక్డౌన్ కారణంగా మార్కెట్లో అస్థిర పరిస్థితులు నెలకొనడంతో ఆ ప్రతిపాదనను పక్కన పెట్టింది. ప్రస్తుతం మార్కెట్లు ఊహించినదానికన్నా వేగంగా పుంజుకోవడం, బెంచ్ మార్క్ ఇండెక్స్లన్నీ గరిష్ఠ స్థాయుల్లో ఉండడంతో 8.5 శాతం వడ్డీ చెల్లించడం పెద్ద సమస్య కాబోదని కొందరు అంటున్నారు.టీచర్స్ ట్రాన్సఫర్స్ కి సంబదించిన పూర్తి సమాచారం