ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (APSRTC)లో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ప్రయాణ ఖర్చుల నుంచి వారికి విముక్తి కల్పిస్తున్నట్లు ప్రకటించింది. నూతన సంవత్సర కానుకగా వారికి ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తోంది. ఈ విషయాన్ని ఆర్టీసీ ఎండీ కృష్ణబాబు స్వయంగా ప్రకటించారు. ఏపీఎస్ ఆర్టీసీలోని డిపోలు, యూనిట్లు, ఇతర విభాగాల్లో వచ్చే ఏడాది జనవరి 1వ తేదీ నుంచి అమలు చేయబోతున్నట్లు ఆయన తెలిపారు. ఆర్టీసీలో మొత్తం 5 వేల మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు పనిచేస్తున్నారు. ప్రతిరోజూ వీరంతా తమ ఇళ్ల నుంచి డిపోలు, యూనిట్ కార్యాలయాలకు సొంత ఖర్చులతో ప్రయాణం చేయాల్సి వస్తోంది. ప్రభుత్వం ప్రకటనపై ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు.
ఔట్ సోర్సింగ్ సిబ్బందికి ఆర్థిక వెసులుబాటు కల్పించే ఉద్ధేశంతో ఈ ఉచిత బస్పాస్లు మంజూరు చేస్తున్నట్లు ఆర్టీసీ ఎండీ కృష్ణబాబు తెలిపారు. సిటీ ఆర్డినరీ, సబర్బన్, మెట్రో ఎక్స్ప్రెస్, పల్లె వెలుగు బస్సుల్లో ఈ బస్ పాస్లు చెల్లుబాటవుతాయి. ఔట్ సోర్సింగ్ పద్ధతిలో పనిచేసే వారు తమ నివాసం నుంచి 25 కి.మీ.లోపు బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు.
ఆర్టీసీలో ఇప్పటివరకు శాశ్వత ఉద్యోగులకు, వారి కుటుంబాలకు మాత్రమే ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని ప్రభుత్వం కల్పిస్తోంది. తమకు కూడా ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని ఔట్ సోర్సింగ్ గులు డిమాండ్ చేస్తున్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన తర్వాత మరోసారి ఉద్యోగులు ప్రభుత్వాన్ని కోరగా.. దీనిపై ఉద్యోగ పూర్తిస్థాయిలో చర్చలు జరిపిన అనంతరం ఉచిత ప్రయాణానికి సంబంధించిన జీవో జారీ చేశారు.