AP Ration new prices
అంతకుముందు కందిపప్పు కిలో రూ. 40లు ఉండగా.. రూ. 27 పెరిగి రూ. 67 అయ్యింది.
ఏపీలో ఈ నెల నుంచి రేషన్ సరుకుల ధరలు పెరగనున్నాయి. కరోనా కారణంగా నవంబర్ వరకు ప్రభుత్వం ఉచితంగా సరకులు పంపిణీ చేసింది. అయితే ఈ నెల నుంచి వాటికి పొందేందుకు డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. ఇక రేషన్లో అందించే పలు సరుకుల ధరలు పెరిగాయి. వినియోగదారులు కిలో కందిపప్పు రూ. 67, చక్కెర అరకిలో రూ. 17, బియ్యానికి కిలో రూపాయి చెల్లించాల్సి ఉంటుంది. బియ్యం కిలో రూపాయికే ఇస్తున్నప్పటికీ కందిపప్పు, చక్కెర రేట్లు పెరిగాయి. అయితే నాలుగు నెలల క్రితమే వీటి ధరలు పెంచినప్పటికీ.. కరోనా కారణంగా ఇప్పటివరకు ఉచిత పంపిణీ చేస్తూ వచ్చారు.
అయితే ఈ నెల నుంచి ఈ పెంచిన ధరలను అమలు చేస్తున్నారు. కార్డులో ఉన్న ఇంటి సభ్యులు ఒక్కొక్కరికి 5 కిలోల బియ్యం, కిలో కందిపప్పు, అరకిలో పంచదార ఇవ్వనున్నారు. అంతకుముందు కందిపప్పు కిలో రూ. 40లు ఉండగా.. రూ. 27 పెరిగి రూ. 67 అయ్యింది. మరోవైపు పెరిగిన ధరలతో కందిపప్పు కొనేందుకు లబ్ధిదారులు సముఖంగా ఉండరేమోనని రేషన్ డీలర్లు అభిప్రాయపడుతున్నారు. బహిరంగ మార్కెట్లో దీనికంటే రూ. 20, 30లు మాత్రమే ధర వ్యత్యాసం ఉందని..పైగా చౌకదుకాణంలో ఇచ్చే కందిపప్పు నాణ్యత సరిగ్గా లేదని కార్డుదారులు అంటున్నారు.
మరోవైపు ఏపీలో రేషన్ డీలర్లను తొలగిస్తున్నారంటూ వస్తున్న వార్తలను ప్రభుత్వం ఖండించింది. అలాంటి ఉద్దేశం జగన్ సర్కారుకు లేనది పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని స్పష్టం చేశారు. గత ప్రభుత్వాల కంటే మెరుగైన నాణ్యత ఉన్న బియ్యం ఇచ్చేలా చర్యలు తీసుకున్నామని, పేద ప్రజలు తినే రేషన్ బియ్యంలో సమూల మార్పులు తెచ్చామని మంత్రి వెల్లడించారు. ఈ నిర్ణయతో గవర్నమెంట్పై రూ. 350 కోట్ల భారం పడ్డా పేదలకు అందించే బియ్యం విషయంలో రాజీ పడలేదన్నారు. అలాగే కోవిడ్ వ్యాప్తి సమయంలో ప్రజలపై భారం పడకుండా రేషన్ డీలర్లకు రూ. 22 కోట్లు కమీషన్ రూపంలో ప్రభుత్వమే ఇచ్చిందని స్పష్టం చేశారు. రేషన్ డీలర్లను తొలగించే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని, వారికి ఇవ్వాల్సిన బకాయిలు కూడా త్వరలోనే చెల్లిస్తామని కొడాలి నాని తెలిపారు
అంతకుముందు రాష్ట్రంలో వాలంటీర్ల వ్యవస్థ వచ్చిన తర్వాత రేషన్ డీలర్లను తొలగిస్తారనే వార్తలు వినిపించాయి. సరుకులను గ్రామ, వార్డు వాలంటీర్లే ప్రతి ఇంటికి వెళ్లి డోర్ డెలివరీ చేస్తారని సీఎం జగన్ ప్రకటించడంతో రేషన్ డీలర్ల వ్యవస్థ రద్దు అవుతుందని ప్రచారం జరిగింది. అయితే దీనిపై పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని క్లారిటీ ఇచ్చారు.