AP Group 1 Mains exam dates confirmed
ఆంధ్రప్రదేశ్లో గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల తేదీలను ఏపీపీఎస్సీ ప్రకటించింది. డిసెంబర్ 14 నుంచి డిసెంబర్ 20వ తేదీ వరకు గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలను నిర్వహించనున్నట్టు ఏపీపీఎస్పీ ఒక ప్రకటనలో వెల్లడించింది. మొత్తం 9,679 మంది అభ్యర్థులు గ్రూప్-1 మెయిన్స్ పరీక్ష రాయనున్నట్టుగా పేర్కొంది. డిసెంబర్ 12వ తేదీ వరకు 8,099 మంది అభ్యర్థులు తమ హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకున్నారని తెలిపింది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు మెయిన్స్ పరీక్షలు నిర్వహించనున్నట్టు తెలిపింది. ఇందుకోసం రాష్ట్రంలోని 13 జిల్లాలతో పాటు హైదరాబాద్లో కూడా పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామని చెప్పింది. మొత్తం 41 పరీక్ష కేంద్రాల్లో పరీక్షను నిర్వహించనున్నట్టు వెల్లడించింది. ఇందులో 34 సెంటర్లు ఏపీలో ఉండగా, 7 సెంటర్లు హైదరాబాద్లో ఉన్నాయి. అభ్యర్థులు హాల్ టికెట్తో పాటుగా ఒర్జినల్ గుర్తింపు కార్డు తప్పకుండా తీసుకురావాల్సి ఉంటుందని ఏపీపీఎస్సీ తెలిపింది.
ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో అభ్యర్థులు కోవిడ్-19 మార్గదర్శకాలు పాటించాలని ఏపీపీఎస్సీ తెలిపింది. ఉదయం 8:45 గంటల నుంచి 9:30 గంటల మధ్య మాత్రమే అభ్యర్థులను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతిస్తామని ఏపీపీఎస్సీ పేర్కొంది. అయితే కోవిడ్ నేపథ్యంలో 15 నిమిషాల గ్రేస్ పీరియడ్తో అభ్యర్థులను ఉదయం 9:45 గంటల వరకు పరీక్షకు అనుమతించనున్నట్టు తెలిపింది. గ్రేస్ పీరియడ్ టైమ్ పూర్తయ్యాక అభ్యర్థులను ఎట్టి పరిస్థితుల్లో పరీక్ష రాసేందుకు అనుమతించబోమని స్పష్టం చేసింది. పరీక్షా కేంద్రాల ఎంట్రీ వద్ద థర్మో గన్తో అభ్యర్థుల టెంపరేచర్ను చెక్ చేయనున్నట్టు తెలిపింది. ఎవరికైనా కరోనా లక్షణాలు ఉంటే వారిని పరీక్ష కేంద్రాల్లో ఏర్పాటు చేసిన ఐసోలేషన్ రూమ్లో పరీక్ష రాసేందుకు ఏర్పాట్లు చేసినట్టు వివరించింది.
అభ్యర్థుల ఫిర్యాదులు, పరీక్షలకు సంబంధించిన సమాచారం కోసం విజయవాడలోని కమిషన్ కార్యాలయంలో హెల్ఫ్డెస్క్ ఏర్పాటు చేశామని తెలిపారు. పరీక్షలకు సంబంధించిన సమాచారం కోసం 0866-252-7820, 0866-252-7821, 0866-252-7819 నంబర్లను సంప్రదించాలని తెలిపింది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు ఈ ఫోన్ నెంబర్లకు ఫోన్ చేసి సమాచారం పొందవచ్చని తెలిపింది.
ఇక, ఆంధ్రప్రదేశ్లో 169 గ్రూప్-1 పరీక్షలకు గతేడాది స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించిన సంగతి తెలిసిందే. తొలి కీ తర్వాత మెయిన్స్ పరీక్షకు 1:50 ప్రకారం అభ్యర్థులను ఎంపిక చేసింది. అయితే ‘కీ’లో అభ్యంతరాలు సరిచేసిన తర్వాతే గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష నిర్వహించాలని నష్టపోయిన అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో హైకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ ఏడాది అక్టోబర్లో ఏపీపీఎస్సీ గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షా ఫలితాలను విడుదల చేసింది.