- 384 మంది ఉపాధ్యాయులకు షోకాజ్ నోటిసులు
- ఆన్లైన్లో ఎన్సీఈఆర్టీ ఇచ్చిన శిక్షణకు గైర్హాజరు
బోధనా సామర్థ్యం పెంపు కోసం ఎస్సీఈఆర్టీ ఇస్తున్న ఆన్లైన్ శిక్షణకు డుమ్మా కొట్టిన 384 మంది ఉపాధ్యాయులకు జిల్లా విద్యా శాఖ షోకాజ్ జారీచేసింది. మూడు రోజుల్లో సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. నోటీసులు అందుకున్న వారిలో స్కూలు అసిస్టెంట్లు 87 మంది, ఎస్జీటీలు/పండిట్లు 301 మంది ఉన్నారు. ఒకటి నుంచి ఎనిమిదో తరగతి వరకు బోధించే ఉపాధ్యాయులకు అక్టోబరు 16 నుంచి జనవరి ఐదో తేదీ వరకు దశల వారీగా ఆన్లైన్లో శిక్షణ ఇవ్వాలని ప్రతిపాదించారు. జిల్లాలో మొత్తం 7,675 మంది టీచర్లకు శిక్షణ ఇవ్వాలని ప్రతిపాదించగా 8,691 మంది పేర్లు నమోదుచేసుకున్నారు. ఆన్లైన్ శిక్షణ కోసం ప్రతి 50 మందికి ఒక రిసోర్స్పర్సన్ను గుర్తించారు. రిసోర్స్ పర్సన్ తన గ్రూపులో టీచర్లను శిక్షణ తరగతులకు హాజరుకావడం నుంచి అవసరమైన సూచనలు చేయాల్సి ఉంటుంది. అయితే జిల్లాలో ఎక్కువ మంది టీచర్లు తమ పేర్లు నమోదుచేసుకున్నా...తరువాత తరగతులకు హాజరు విషయంలో సుమారు 1200 మంది లాగిన్ కాలేదని గుర్తించారు. రిసోర్స్పర్సన్లు సంబంధిత టీచర్లకు సమాచారం అందించడంతో కొంతమంది టీచర్లు ఆన్లైన్ శిక్షణ తీసు కున్నారు. అయినా జిల్లాలో ఇంకా 384 మంది టీచర్లు శిక్షణకు హాజరుకాలేదు. ఈ విషయాన్ని సమగ్ర శిక్షా అభియాన్ అధికారులు తీవ్రంగా పరిగణించి జిల్లా విద్యాశాఖకు సమాచారం అందించారు. ఈ నేపథ్యంలో మంగళవారం 384 మంది టీచర్లకు షోకాజ్ ఇచ్చామని డీఈవో బి.లింగేశ్వరరెడ్డి తెలిపారు