ఎస్బీఐ మాస్టర్ కార్డ్ వినియోగదారులకు శుభవార్త. ఇకపై మీ షాపింగ్ మరింత సులభతరం చేసేందుకు ఎస్బీఐ మరో సదుపాయం అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ సదుపాయంతో కార్డు లేకుండా కూడా అ కాంటాక్ట్స్ పేమెంట్ ద్వారా రెండు వేల వరకు కూడా చెల్లింపులు జరుపుకోవచ్చు. ఎస్బీఐ కార్డ్ యాప్ మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకుని, వన్ టైం రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకుంటే చాలు. ఇక రెండు వేల రూపాయల తక్కువలో నగదు లావాదేవీలు నిర్వహించేందుకు కార్డు తీసుకు వెళ్లాల్సిన అవసరం లేదు మొబైల్ అప్లికేషన్ ఓపెన్ చేసి పీఓఎస్ మిషన్ దగ్గరగా పెడితే చెల్లింపు జరిగిపోతుంది. అయితే రెండు వేలు దాటిన లావాదేవీలకు మాత్రం కార్డ్ ఉపయోగించాల్సి ఉంటుంది.
ఈ సదుపాయం టోకనైజేషన్ ద్వారా వినియోగదారులకు అందుబాటులోకి తీసుకువచ్చారు.
ముఖ్యంగా షాపింగ్ మరింత సురక్షితంగా నిర్వహించుకునేందుకు ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకు వచ్చినట్లు ఎస్బీఐ పేర్కొంది.
ఎస్బీఐ కార్డ్ సీఈవో, ఎండీ, అశ్విని కుమార్ తివారి ఈ విషయంపై మాట్లాడారు. కరోనా నేపథ్యంలో కాంటాక్ట్స్ చెల్లింపులు గణనీయంగా పెరిగాయని ఆయన పేర్కొన్నారు. ఖాతాదారుల సౌలభ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకు వచ్చినట్లు పేర్కొన్నారు. ఈ కాంటాక్ట్ లెస్ చెల్లింపుల ప్రక్రియ ద్వారా షాపింగ్ మరింత సురక్షితంగా జరుగుతుందని తెలిపారు. వ్యాపారులు, ఖాతాదారులు డిజిటల్ చెల్లింపులకే మొగ్గు చూపుతున్నారని, సులభతరంగా లావాదేవీలు నిర్వహించే అవకాశం ఈ సదుపాయంతో కలగనుందని పేర్కొన్నారు.
ప్రస్తుతం ఉన్న పరిస్థితులు, సైబర్ నేరాలు విపరీతంగా పెరుగుతున్న దృష్ట్యా ప్రతిసారి కార్డులను ఉపయోగించి లావాదేవీలు నిర్వహించడం అంత సురక్షితమైన పద్ధతి కాదని ఇప్పటికే నిపుణులు సూచిస్తున్నారు. ఇటీవల కాంటాక్ట్ లెస్ చెల్లింపులపై వినియోగదారుల మనోగతం గురించి మాస్టర్ కార్డ్ సర్వే నిర్వహించింది. 74% మంది భవిష్యత్తులో డిజిటల్, కాంటాక్ట్ లెస్ చెల్లింపులకే మొగ్గుచూపారని పేర్కొంది.
మాస్టర్ కార్డ్ దక్షిణ ఆసియా డివిజన్ ప్రెసిడెంట్ పోరుష్ సింగ్ ఈ సందర్భంగా మాట్లాడారు. సురక్షితమైన లావాదేవీలు, సులభతరమైన చెల్లింపుల ప్రక్రియను వినియోగదారులకు చేరువ చేసేందుకు మాస్టర్ కార్డ్ కృషి చేస్తోందని అన్నారు.
ఎలా ఉపయోగించాలి:-
- మాస్టర్ కార్డ్ వినియోగదారులు తమ స్మార్ట్ ఫోన్లో ఎస్బీఐ కార్డ్ యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలి.
- వన్ టైం రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇక ఈ సదుపాయం అందుబాటులోకి వచ్చినట్లే.
- ₹2,000/- లోపు చెల్లింపులు మొబైల్ యాప్ నుంచే పూర్తి చేయవచ్చు. మర్చంట్ పీవోఎస్ మిషన్ దగ్గరికి మొబైల్ తీసుకురాగానే కాంటాక్ట్ లెస్ చెల్లింపు జరిగిపోతుంది.