Covid Guidelines: కరోనాపై యుద్ధం.కేంద్రం కొత్త మార్గదర్శకాలు ఇవే
Covid Guidelines: కరోనా వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేయడమే లక్ష్యంగాఅన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు డిసెంబరు 1 నుంచి అమలు చేయాల్సిన నిబంధనలను ప్రకటించింది. కొన్ని చోట్ల కొత్త కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వీటిని ఖచ్చితంగా అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది.
మన దేశానికి కరోనా సెకండ్ వేవ్ టెన్షన్ పట్టుకుంది. పండగల వేళ జనం గుంపులుగా తిరగడం, అదే సమయంలో శీతాకాలం ప్రారంభమైన నేపథ్యంలో..పలు ప్రాంతాల్లో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ఢిల్లీలో కొత్త కేసులతో పాటు మరణాలు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. ఈ క్రమంలో కేంద్రహోంశాఖ కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేయడమే లక్ష్యంగా.. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు డిసెంబరు 1 నుంచి అమలు చేయాల్సిన నిబంధనలను ప్రకటించింది. కొన్ని చోట్ల కొత్త కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వీటిని ఖచ్చితంగా అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది.
రాష్ట్రాలకు కేంద్రం కొత్త మార్గదర్శకాలు:
- కంటైన్మెంట్ జోన్లలో అత్యవసర కార్యకలాపాలకు మాత్రమే అనుమతి ఉంటుంది.
- కంటైన్మెంట్ జోన్ల వెలుపల లాక్డౌన్కు కేంద్రం అనుమతి తప్పనిసరి.
- కంటైన్మెంట్ జోన్లలో కరోనా నిబంధనలు కఠినంగా అమలు చేయాలి. ఆ బాధ్యత పోలీసులు, జిల్లా యాంత్రాంగానిదే.
- స్థానిక పరిస్థితుల ఆధారంగా రాత్రివేళల్లో కర్ఫ్యూ వంటి నిబంధనలు రాష్ట్రాలు విధించుకోవచ్చు.
- మాస్క్లు ధరించడం, చేతులు శుభ్రం చేసుకోవడం, భౌతికదూరం పాటించడం వంటి అంశాలపై ప్రజల్లో మరింత చైతన్యం కలిగించాలి.
- కరోనా నిబంధనలు పాటించని వారిపై చర్యలు తీసుకోవాలి. బహిరంగ ప్రదేశాల్లో మాస్క్లు ధరించని వారికి తగిన జరిమానా విధించాలి.
- రాష్ట్రాల మధ్య ప్రయాణాలకు ఎలాంటి అనుమతులు అవసరం లేదు.
- కంటైన్మెంట్ జోన్ల వెలుపల అన్ని కార్యకలాపాలకూ కేంద్రం అనుమతి ఉంటుంది.
- అంతర్జాతీయ ప్రయాణికులను కేంద్ర హోంశాఖ నిబంధనల ప్రకారం అనుమతించాల్సి ఉంటుంది.
- 50 శాతం సామర్థ్యంతో సినిమా థియేటర్లు తెరుచుకోవచ్చు.
- క్రీడాకారుల శిక్షణ నిమిత్తం మాత్రమే స్విమ్మింగ్ పూల్స్కు అనుమతి. సాధారణ ప్రజలకు అనుమతి లేదు.
- సామాజిక, ఆధ్యాత్మిక, క్రీడా, వినోదం, విద్య, మతపరమైన కార్యక్రమాలకు 50 శాతం సామర్థ్యంతో హాలులోకి అనుమతించవచ్చు.
- మిగతా ఏ ఇతర కార్యక్రమాలకు 200 మందికి మించరాదు.
- ప్రజలందరూ ఆరోగ్య సేతు యాప్వాడేలా ఆయా ప్రభుత్వాలు ప్రోత్సహించాలి