*♦829 మంది టీచర్లు, 575 మంది విద్యార్థులకు కొవిడ్*
*♦తీవ్రతను తగ్గించి చూపేందుకు సర్కారు యత్నాలు*
*♦కరోనాకు చిత్తూరులో ప్రధానోపాధ్యాయుడు బలి*
*♦ఫిబ్రవరిలోనే కోవ్యాక్సిన్‘అత్యవసర’ అనుమతికి రెడీ*
*♦కొంత ముప్పు ఉండొచ్చు*
*♦ఎదుర్కొనేందుకు సిద్ధమయ్యే వాళ్లు* *వేయించుకోవచ్చు: ఐసీఎంఆర్*
*♦4 రోజుల్లోనే 13 జిల్లాల్లోనూ కరోనా కేసులు నమోదు*
*♦కేసులు దాచిపెట్టాలని డీఈవోలకు మౌఖిక ఆదేశాలు*
*♦వణికిపోతున్న తల్లిదండ్రులు, టీచర్లు*
*🌻అమరావతి, నవంబరు 5(ఆంధ్రజ్యోతి):* పాఠశాలల్లో కరోనా భూతం విజృంభిస్తోంది. బడులు తెరిచిన నాలుగు రోజుల్లోనే రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ విద్యార్థులు, ఉపాధ్యాయులు వైరస్ బారిన పడ్డారు. ఈ నెల 2 నుంచి 9,, 10వ తరగతుల విద్యార్థులకు రోజు విడిచి రోజు ఒంటిపూట బడులు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని మొత్తం 41,623 ప్రభుత్వ పాఠశాలల్లో 70,790 మంది ఉపాధ్యాయులకు, 95,763 మంది విద్యార్థులకు కరోనా పరీక్షలు చేశారు. 829 మంది టీచర్లు, 575 మంది విద్యార్థులకు కొవిడ్ సోకినట్లు నిర్ధారణ అయిందని పాఠశాల విద్యాశాఖ ఉన్నతాధికారులు వెల్లడించారు. అయితే పాజిటివ్ వచ్చిన విద్యార్థుల సంఖ్య 900కు పైగానే ఉంటుందని అనధికారికంగా తెలుస్తోంది. కొవిడ్ రెండో దశ సంకేతాలను ఏమాత్రం ఖాతరు చేయని ప్రభుత్వం బడులు తెరవడంపై ఎవరెన్ని సూచనలు చేసినా పెడచెవిన పెట్టింది. తాను అనుకున్న ప్రకారమే ఈ నెల 2 నుంచి పాఠశాలలు ప్రారంభించింది. మొదటిరోజు నుంచే కేసులు నమోదవుతున్నా పట్టించుకోలేదు.
🌻పైగా ఇప్పుడు పాజిటివ్ వచ్చిన వారికి బడులకు రాకముందే వైరస్ సోకిందని, అప్పట్లో వారు పరీక్షలు చేయించుకోలేదని ప్రభుత్వ పెద్దలు రివర్స్లో వ్యాఖ్యలు చేస్తున్నారు. బడికి వెళ్లకపోతే పిల్లలు వెనకబడిపోతారని గ్రామీణ ప్రాంతాల్లో తల్లిదండ్రులు భావిస్తున్నారు. కరోనా తీవ్రత గురించి భయాందోళన ఉన్నప్పటికీ అయిష్టంగానే పంపిస్తున్నారు. పట్టణ, నగర ప్రాంతాల్లో మాత్రం హాజరు తక్కువగానే ఉంటోంది. అధికారుల లెక్కల ప్రకారం చూసినా బడికి వస్తున్న విద్యార్థుల సంఖ్య అంతంతమాత్రంగానే ఉందని స్పష్టమవుతోంది. నవంబరు 30 వరకు అన్లాక్-5 నిబంధనలు కొనసాగుతాయని కేంద్రం చెప్పినా పిల్లల ఆరోగ్యం గురించి ఎందుకు ఆలోచించడం లేదని పలువురు ప్రశ్నిస్తున్నారు.
*♦కేసుల లెక్కల్లో గోల్మాల్*
జిల్లాల నుంచి అందుతున్న సమాచారానికి, డీఈవోలు చెబుతున్న సంఖ్యకు పొంతన ఉండటం లేదు. కేసుల సంఖ్య తక్కువగా చూపించాలని ఉన్నతాధికారుల నుంచి మౌఖిక ఆదేశాలు రావడంతో పలువురు డీఈవోలు ఒత్తిడికి గురవుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు స్కూళ్లలో కరోనా విజృంభణకు కారణాలేంటన్న కోణంలో సర్కారు ఆరా తీయడం లేదు. వైరస్ సోకిన టీచర్లకు 14 రోజుల క్యాజువల్ లీవ్ మంజూరు చేయాలని ఆదేశాలు ఇచ్చి అధికారులు చేతులు దులుపుకుంటున్నారు. అయితే కొవిడ్ బారిన పడిన ఉపాధ్యాయులకు పరిహారం చెల్లించాలన్న డిమాండ్లు వస్తున్నాయి.
*♦కరోనాతో ప్రధానోపాధ్యాయుడి మృతి*
చిత్తూరు జిల్లాకు చెందిన ఓ ప్రధానోపాధ్యాయుడిని కరోనా బలి తీసుకుంది. బుచ్చినాయుడుకండ్రిగ మండలం గోవిందప్పనాయుడుకండ్రిగ ప్రాఽథమికోన్నత పాఠశాలలో పనిచేస్తున్న ఆర్.దినేశ్(45)కు గతనెల మొదటివారంలో అనారోగ్య సమస్యలు తలెత్తడంతో కొవిడ్ పరీక్షలు చేయించగా నెగటివ్ వచ్చింది. సీజనల్ వ్యాధిగా భావించి చికిత్సలు చేయించుకున్నారు. వారం తర్వాత దగ్గు ఎక్కువ కావడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఏర్పడటంతో సీటీ స్కాన్ చేయించడంతో వైరస్ సోకినట్లు తేలింది. అప్పటికే ఊపిరితిత్తులు బాగా దెబ్బతిన్నట్లు వైద్యులు గుర్తించారు. చెన్నై ప్రైవేటు ఆస్పత్రిలో దినేశ్ గురువారం మృతి చెందారు.
ప్రకాశంలో
ప్రకాశం జిల్లా వ్యాప్తంగా గురువారం 378 మంది టీచర్లకు, 1,101 మంది విద్యార్ధులకు పరీక్షలు నిర్వహించారు. వారిలో ఒక ఉపాధ్యాయుడికి, ముగ్గురు విద్యార్థులకు పాజిటివ్గా నిర్ధారణ అయింది.ముండ్లమూరు మండలం భీమవరంలో వారం క్రితం 100 మందికి పరీక్షలు నిర్వహించగా 8మంది విద్యార్థులకు పాజిటివ్ వచ్చింది. వీరంతా బడులు తెరిచాక రాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా లింగంపర్తి జడ్పీ హైస్కూల్లో ఒక ఉపాధ్యాయుడికి కొవిడ్ సోకింది. కొత్తపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పార్ట్టైమ్ అధ్యాపకుడికి కరోనా రావడంతో ఐసొలేషన్ నిమిత్తం క్వారంటైన్కు తీసుకువెళ్లారు. ఆయనతో సంబంధం ఉన్న మరో ఇద్దరు కూడా పరీక్షలకు వెళ్లారు.