ఏపీలో ఫేక్ ఆధార్ కార్డు తయారీ ముఠా అరెస్టు కలకలం సృష్టించింది. ప్రభుత్వ పథకాల్లో అనర్హులకు లబ్ధి చేకూర్చడమే లక్ష్యంగా ఈ ముఠా పనిచేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. వీరు ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి కొట్టినట్లు పోలీసుల విచారణలో తేలింది.
ఏపీలో ఫేక్ ఆధార్ కార్డు తయారీ ముఠా అరెస్టు కలకలం సృష్టించింది. ప్రభుత్వ పథకాల్లో అనర్హులకు లబ్ధి చేకూర్చడమే లక్ష్యంగా ఈ ముఠా పనిచేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. వీరు ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి కొట్టినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఈ విషయమై ఎస్పీ రవీంద్రబాబు మాట్లాడుతూ.. ఫేక్ ఆధార్ కార్డు తయారీ ముఠా అరెస్ట్ చేశామని తెలిపారు. ఈ కేసులో జిల్లాలో ఆరుగురు అరెస్ట్ చేశామని, పరారీలో మరికొందరు నిందితులున్నారని ఎస్పీ ప్రకటించారు. రూ. 5 వేలకు నకిలీ ఆధార్ కార్డును తయారు చేస్తున్నట్లు గుర్తించామని పేర్కొన్నారు.
గుడివాడ, తిరువూరులో ఆధార్ కార్డును ట్యాంపరింగ్ చేస్తున్నట్టు గుర్తించామని, సంక్షేమ పథకాల కోసం అక్రమాలకు పాల్పడుతున్నట్లుగా తేలిందన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు. కాగా.. తిరువూరులోని ఆధార్ కేంద్రంలో పోలీసులు తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో ప్రభుత్వ సంక్షేమ పథకాల కోసం ఆధార్ కార్డు, పాన్కార్డ్ డేటా బేస్లలో వయస్సు మార్పులు చేసినట్లు పోలీసులు గుర్తించారు.
అనర్హులకు లబ్ధి చేకూర్చి ప్రభుత్వ ఆదాయానికి నిర్వాహకులు గండికొట్టినట్లుగా గుర్తించారు. ఆధార్ సెంటర్ నిర్వాహకుడు, అతడికి సహకరించిన ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేసినట్లు నూజివీడు డీఎస్పీ శ్రీనివాసులు ప్రకటించారు. నిందితులపై పోలీసులు కేసు నమోదు చేశారు. వారి వద్ద నుండి కంప్యూటర్లు, లాప్టాప్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.