సైబర్ నేరాలు బాగా ఎక్కువైపోయున ఈ రోజుల్లో అప్రమత్తంగా లేకపోతే అంతే సంగతులు. గతంలో దొంగతనం చేయాలంటే దారికాచి మనుషులు దాడిచేసి దొంగతనాలు చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. అత్యాధునిక టెక్నాలజీ ఉపయోగిస్తున్న సైబర్ కేటుగాళ్ళు మోసాలకు పాల్పడుతున్నారు. ఇలా మోసాలు చేస్తున్నారు ఎక్కువగా +92, +1, +968, +44తో పాటు +473, +809, +900 సిరీస్లతో మొదలయ్యే ఫోన్ నంబర్లు వాడుతున్నారు. ఈ నంబర్లతోనే ఆన్ లైన్ మోసాలకు పాల్పడుతున్నారు.
ఈ సిరీస్ ఫోన్ నంబర్ల నుంచి వచ్చిన కాల్స్ రిసీవ్ చేసుకుంటే.. మీ ఫోన్ లో ఉన్న మొతం డేటా గల్లంతు కావడం ఖాయం. ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని సైబర్ క్రైమ్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఈ ఫోన్ నెంబర్ల మోసాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు తాజాగా ఓ వీడియో రూపొందించారు. ఇలాంటి సిరీస్లతో కూడిన నంబర్లతో ఫోన్లు చేస్తున్న కొందరు దుండగులు ప్రజలను బురిడీ కొట్టిస్తున్నారు.
ఈ నంబర్లు ఎవరూ గుర్తించకుండా మన స్నేహితుల ఫొటోలతోనే సేవ్ చేస్తున్నారట. సోషల్ మీడియాలో వాట్సాప్, ఫేస్బుక్ లోంచి మనకు తెలిసిన కొందరి ఫొటోలను సేకరిస్తారీ మోసగాళ్లు. ఆ తర్వాత ఫేక్ నంబర్లను ఆ ఫొటోలతో సేవ్ చేస్తారు. ఆ తర్వాత మనకు ఫోన్ చేస్తారు. స్నేహితుడు, స్నేహితురాలి ఫొటోతో ఫోన్ రావడంతో మనం నంబర్ పెద్దగా పట్టించుకోం.
నంబర్ చూడకుండానే ఫోన్ లిఫ్ట్ చేసేస్తాం. దీంతో ఆ మన మొబైల్లోని సమాచారం మొత్తం సైబర్ నేరగాళ్లకు చేరిపోతోంది. ఫోన్ కాల్స్, వాట్సాప్ కాల్స్ లిఫ్ట్ చేసేటప్పుడు.. అప్రమత్తంగా ఉండి, ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోవాలని సైబర్ పోలీసులు హెచ్చరికలు చేస్తున్నారు. లేదంటే మన ఫోన్ లో ఉండే ఫోటోలు, వీడియోలు సహా అన్నీ వాళ్ళకు చేరే అవకాశం ఉందట. మీరు కూడా ఫోన్ కాల్స్ వచ్చినప్పుడు నంబర్లను గమనించడం మంచిది.