- పశ్చిమలో 10 మంది టీచర్లకు పాజిటివ్
- గుంటూరులో 4 రోజుల్లోనే 213 కేసులు
- ప్రకాశంలో ఒకేరోజు 17 మందికి వైరస్
- రాష్ట్రంలో మరో 2,410 కరోనా కేసులు
రాష్ట్రంలోని పాఠశాలల్లో కరోనా కల్లోలం కొనసాగుతోంది. గత 24 గంటల్లో పశ్చిమగోదావరిలో పది మంది ఉపాధ్యాయులు, ముగ్గురు విద్యార్థులు కరోనా బారినపడ్డారు. జిల్లాలోని పాఠశాల్లో 11 రోజులుగా నిర్వహించిన కొవిడ్ టెస్టుల్లో ఇప్పటికే 291 మంది విద్యార్థులు, 181మంది ఉపాధ్యాయులకు కరోనా సోకింది. శుక్రవారం తాజాగా ఒక హెచ్ఎం, తొమ్మిది మంది ఉపాధ్యాయులతోపాటు ముగ్గురు విద్యార్థులకు కరోనా నిర్ధారణ అయింది. దీంతో కరోనా బారిన పడిన విద్యార్థుల సంఖ్య 294కి, ఉపాధ్యాయుల సంఖ్య 191కి చేరుకుంది. గుంటూరు జిల్లాలోని పాఠశాలల్లో నాలుగు రోజుల వ్యవధిలోనే 213 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 141 మంది విద్యార్థులు, 72 మంది ఉపాధ్యాయులు వైరస్ బారినపడ్డారు. ప్రకాశం జిల్లాలో శుక్రవారం ఒక్కరోజే 14 మంది ఉపాధ్యాయులతోపాటు ముగ్గురు విద్యార్థులకు కరోనా సోకడం కలవరపాటుకి గురిచేసింది. శ్రీకాకుళం జిల్లా రణస్థలం జడ్పీ హైస్కూల్లో ఇద్దరు ఉపాధ్యాయినులకు కరోనా సోకింది. కర్నూలు జిల్లా బనగానపల్ల్లె పట్టణంలోని మోడల్ స్కూల్లో ఓ విద్యార్థినికి, ఆళ్లగడ్డ పట్టణంలోని ఎయిడెడ్ పాఠశాల ప్రధానోపాధ్యాయునికి పాజిటివ్ వచ్చింది.