♦ఉపాధ్యాయుల సెలవులపై కమిషనరు వివాదాస్పద ఉత్తర్వులు
♦యూనియన్ల ఆగ్రహంతో వెనకడుగు
ఉపాధ్యాయుల సెలవుల పై పాఠశాల విద్యాశాఖ శుక్రవారం గందరగోళం సృష్టించింది. సెలవుల వాడకంపై మధ్యాహ్నం ఒక ఉత్తర్వులు, సాయంత్రం మరో ఉత్తర్వులు విడుదల చేసి ఉపాధ్యాయులను ఆందోళనకు గురిచేసింది. నవంబరు, డిసెంబరు నెలలు కేవలం 2.5 రోజులు మాత్రమే క్యాజువల్ లీవులను మాత్రమే ఉపయోగించుకోవాలని శుక్రవారం ఉదయం మెమో 151ను కమిషనరు చినవీరభద్రుడు విడుదల చేసి ఉపాధ్యాయులందరిలో ఆందోళన నెలకొల్పారు ఉపాధ్యాయులకు ఏడాదికి 15 క్యాజువల్ లీవులు, 7 స్పెషల్ క్యాజువల్ లీవులు ఉంటాయి. మహిళా ఉపాధ్యాయులకు ఐదు స్పెషల్ క్యాజువల్ లీవులు ఉంటాయి. ఈ సెలవులతో పాటు ఆప్షనల్ హాలీడేలను కూడా రద్దు చేసి నవబరు డిసెంబరులో కేవలం 2.5 రోజుల క్యాజువల్ లీవులు మినహా ఉపాధ్యాయులు ఎలాంటి సెలవులు తీసుకోకూడదని కమిషనరు ఆక్షేపించారు. కరోనాకు గురైన ఉపాధ్యాయుల మెడికల్ లీప్ కు దరఖాస్తు చేసుకోవాలని, ప్రత్యేక సెలవులు ఉండవని పేర్కొన్నారు. కమిషనరు విడుదల చేసిన ఈ ఉత్తర్వులపై ఉపాధ్యాయ సంఘాలు భగ్గుమన్నాయి. ఈ ఉత్తర్వులను వెంటనే ఉపసంహరించుకోవాలని అన్ని ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేశాయి మెమో ను ఉపసంహరించుకోవాలని ఫ్యాప్టో కమిషనరును కలిసి వినతిపత్రం అందజేశాయి. ఉపాధ్యాయుల ఆగ్రహంతో దిగొచ్చిన కమిషనరు ఉదయం విడుదల చేసిన ఉత్తర్వులపై వెనక్కు తగ్గారు. ఉన్న సెలవులను యథావిధిగా వాడుకోవాలని సాయంత్రానికి ఇదే మెమో 151తో మరో ఉత్తర్వులు జారీ చేశారు. కరోనాకు గురైన ఉపాధ్యాయులు క్యాజువల్ లీవులను, ప్రత్యేక క్యాజువల్ లీవులను ఉపయోగించుకోవచ్చునని వెల్లడించారు. ఉపాధ్యాయుల పట్ల విద్యాశాఖ అధికారులు నిరంకుశ వైఖరి ప్రదర్శిస్తున్నారని ఇప్పటికే ఉపాధ్యాయ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ అంశంపై ఇటీవల పట్టభద్ర, ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు మంత్రికి కూడా ఫిర్యాదు చేశాయి. ఈ పరిస్థితిలో మార్పు కనపడటం లేదని ఉపాధ్యాయ సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.