కరోనా మహమ్మారి నేపథ్యంలో చాలామందికి ఉపాధి కరవయ్యింది. ప్రతి పేదకుటుంబాన్ని ఆర్థిక సమస్యలు చుట్టుముట్టాయి. గతంలో మాదిరి వారికి విరివిగా పనులు దొరకటం లేదు. దీంతో తమతో పాటే పిల్లలను కూలీ పనులకు తీసుకెళ్లి తొలుత భుక్తికి ఇబ్బంది లేకుండా చూసుకుంటున్నామని, అందువల్లే పిల్లలు పాఠశాలలకు హాజరుకాలేకపోతున్నారని పలువురు తల్లిదండ్రులు సర్వేలో తమ అభిప్రాయాలను వెలిబుచ్చారు.
ఈ ఏడాది కరోనా తీవ్రత నేపథ్యంలో నవంబరు 2న పాఠశాలలు ప్రారంభమయ్యాయి. పక్షం రోజులు గడిచినా హాజరు శాతంలో పెద్దగా మార్పు లేదు. పిల్లలు ఎందుకు పాఠశాలలకు రావటం లేదో పాఠశాల విద్యాశాఖ ఇటీవల ఓ సర్వే ద్వారా తెలుసుకుంది. జిల్లాలో సర్వే మంగళవారం ముగిసింది. గురువారం కల్లా నివేదిక పంపాలని ఈ సర్వేలో భాగస్వాములైన ఉపాధ్యాయులకు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కార్యాలయం నుంచి ఆదేశాలు ఉన్నాయి. జిల్లాలో 486 పాఠశాలల్లో 9,10 చదివే విద్యార్థులు 66106 మంది ఉన్నారు. 27197 మంది వస్తున్నారు. మొత్తం విద్యార్థుల్లో 50 శాతం మంది రావటం లేదు. పది విద్యార్థులు మాత్రమే బాగా వస్తున్నారని, 9వ తరగతి విద్యార్థుల హాజరు శాతం చాలా అత్యల్పంగా ఉంటోందని విద్యాశాఖవర్గాలు తెలిపాయి. కూలీ పనులకు తీసుకెళ్లటంతో పిల్లలు బడికి రావడం లేదనే అభిప్రాయం వ్యక్తమయ్యింది 9వ తరగతి చదివే పిల్లలకు నిత్యం కాకుండా రోజు విడిచి రోజు పాఠశాలలు పెట్టడంతో కొందరు పిల్లల్లో ఆసక్తి తగ్గింది. ఆన్లైన్లో తరగతులు ఉన్నా చాలా మంది పేద పిల్లలు కావటంతో స్మార్టు ఫోన్, అందులో డేటా వంటివి లేక వినలేకపోయారు. ఈ సర్వే నిర్వహణకు ముందు ప్రతి పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వారి పరిధిలో ఎవరైతే పిల్లలు గైర్హాజరయ్యారో వారి తల్లిదండ్రులను కలిసి మాట్లాడారు. సర్వే వివరాలను ఉన్నతాధికారులకు ఉపాధ్యాయులే పంపారని జిల్లా విద్యాశాఖ అధికారి చెప్పారు.