కరోనాపై రాష్ట్రాలకు కేంద్రం లేఖ
కొవిడ్ వ్యాక్సిన్ పంపిణీని మరింత వికేంద్రీకరించడానికి వీలుగా మండల స్థాయుల్లో టాస్క్ఫోర్స్లు ఏర్పాటు చేయాలని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ రాష్ట్రాలకు లేఖ రాసింది. ‘‘కేంద్ర సూచనల మేరకు ఇప్పటికే రాష్ట్ర, జిల్లా స్థాయుల్లో టాస్క్ఫోర్స్లు ఏర్పాటుచేశారు. ఇప్పుడు వ్యాక్సిన్ పంపిణీ వ్యూహాన్ని మరింత వికేంద్రీకరిస్తూ మండలస్థాయిలో వీటిని ఏర్పాటు చేయాలి. దానికి సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్/ తహసీల్దార్లు నేతృత్వం వహించాలి. వివిధ విభాగాధికారులతో పాటు ప్రజా ప్రతినిధులు, ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులకు స్థానం కల్పించాలి. ప్రతివారం ఏర్పాట్లను పరిశీలించాలి. అప్లోడ్ చేయాల్సిన లబ్ధిదారుల జాబితాను జిల్లాకు పంపుతున్నామా? లేదా? అన్నది పరిశీలించాలి. కొత్త సాఫ్ట్వేర్పై తగిన శిక్షణ ఇవ్వాలి’’ అని రాష్ట్రాలకు సూచించింది.
సమాయత్తత దశలో ఇలా చేయాలి
➤ తొలిదశలో ఏ ప్రాంతంలో వ్యాక్సిన్ ఇవ్వాలో వైద్య ఆరోగ్య సిబ్బంది ప్రణాళిక రూపొందించి మ్యాపింగ్ చేయాలి.
➤ కార్యక్రమంలో అన్ని ప్రభుత్వ శాఖలు, పౌర సమాజ ప్రతినిధులను భాగస్వాములను చేయాలి.
➤ కొవిడ్-19 వ్యాక్సిన్ సమయంలో ఇతర టీకా కార్యక్రమాలు దెబ్బతినకుండా ప్రభుత్వ, ప్రైవేటు రంగంలో వ్యాక్సినేటర్లను ప్రత్యేకంగా గుర్తించాలి.
➤ లబ్ధిదారుల తనిఖీ, రద్దీ నియంత్రణ, వ్యాక్సిన్ కార్యక్రమాన్ని సమన్వయం చేసుకోవడానికి అవసరమైన మానవ వనరులను వివిధ విభాగాల నుంచి తీసుకోవాలి.
అమలు దశలో ఏం చేయాలి?
➤ వ్యాక్సిన్ అమలు తీరును పర్యవేక్షిస్తూ, అమలులో వచ్చే ఇబ్బందులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలి.
➤ సిబ్బంది, వాహనాలు, ఇతర మౌలిక వసతులను జిల్లాస్థాయి నుంచి సమకూర్చుకోవాలి.
➤ ఇతర వ్యాక్సిన్ కార్యక్రమాలకు పెద్దగా ఇబ్బందులు తలెత్తకుండా దీనిని కొనసాగించాలి.
➤ వ్యాక్సినేషన్పై వ్యాపించే వదంతులను ఎప్పటికప్పుడు నిలువరించాలి. ఈ విషయంలో స్థానికంగా ప్రభావశీలురైన వ్యక్తుల సాయం తీసుకొని తప్పుడు సమాచారాన్ని తిప్పికొట్టాలి.