AP sand policy 2019 : ఏపీ ఇసుక కొత్త పాలసీలో వేగంగా అడుగులు పడుతున్నాయి. కేబినెట్ భేటీలో ఇసుక కొత్త పాలసీకి ఆమోదం పొందగా.. రాష్ట్రంలోని ఇసుక రీచులను మూడు ప్యాకేజీలుగా విభజిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్యాకేజీ-1 పరిధిలో ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాలు సహా తూర్పు గోదావరి జిల్లాను చేర్చారు. ఇక ప్యాకేజీ-2లో పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలు ఉన్నాయి. ప్యాకేజీ-3లో నెల్లూరు సహా రాయలసీమ నాలుగు జిల్లాలు ఉంటాయని ప్రభుత్వం స్పష్టం చేసింది.
ప్యాకేజీల వారీగా కేంద్ర ప్రభుత్వ సంస్థలకు అప్పగించాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. ఒకవేళ కేంద్రం సంస్థలు ముందుకు రాకపోతే..
బిడ్డింగ్ ద్వారా ప్రైవేట్ సంస్థలకు అప్పగించాలని సూచించింది. వాల్టా చట్టానికి లోబడే ఇసుక తవ్వకాలు జరపాలని స్పష్టం చేసింది. బ్యారేజీల వద్ద ఇసుక తవ్వకాలకు ఇరిగేషన్, గనుల శాఖ అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలని తెలిపింది.
తమకు నచ్చిన రీచ్ కు వెళ్లి నాణ్యతను స్వయంగా పరిశీలించి, అక్కడికక్కడే డబ్బు చెల్లించి కావాల్సిన చోటుకు ఇసుక తీసుకెళ్లవచ్చని ప్రభుత్వం వెల్లడించింది. ఆన్ లైన్ మోసాలకు ఆస్కారం ఉండదని, సిఫార్సుల ఊసుండదని తెలిపింది. మంత్రివర్గం ఆమోదంతో ప్రభుత్వం ఇసుక పాలసీ - 2019ని మరింత మెరుగు పరిచింది. ఇందుకు సంబంధించి భూగర్భ గనుల శాఖ ముఖ్య కార్యదర్శి గోపాల కృష్ణ ద్వివేది గురువారం జీఓ జారీ చేశారు.
ప్రజలు సొంత అవసరాలకు ఇసుకను ఎడ్లబండ్లపై ఉచితంగా తీసుకోవచ్చని, రీచ్ లకు సమీపంలోని గ్రామాల వారికి, బలహీన వర్గాలకు ప్రభుత్వ గృహ నిర్మాణ పనులకు, సహాయ పునారావాస కార్యక్రమం కింద నిర్మించే ఇళ్లకు కూపన్ల జారీ ద్వారా ఇసుకను ఉచితంగా ఇస్తారు. అన్ని దశల్లో పారదర్శకత ఉంటుంది.