Andhra Pradesh: జగన్ సర్కార్ కు మరో షాకిచ్చిన నిమ్మగడ్డ.కొత్త జిల్లాల ఏర్పాటు ఆపాలని లేఖ
ఏపీలో రాష్ట్ర ఎన్నికల కమిషన్, ప్రభుత్వానికి మధ్య మరో వివాదం మొదలైంది. కొత్త జిల్లాల ఏర్పాటుకు వేగంగా చర్యలు అడుగులు వేస్తున్న ప్రభుత్వానికి ఎస్ఈసీ షాక్ ఇచ్చింది. జిల్లాల పునర్విభజన ప్రక్రియ ఆపాలని ఏపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రభుత్వానికి లేఖ రాశారు.
ఏపీలో రాష్ట్ర ఎన్నికల కమిషన్, ప్రభుత్వానికి మధ్య మరో వివాదం మొదలైంది. కొత్త జిల్లాల ఏర్పాటుకు వేగంగా చర్యలు అడుగులు వేస్తున్న ప్రభుత్వానికి ఎస్ఈసీ షాక్ ఇచ్చింది. జిల్లాల పునర్విభజన ప్రక్రియ ఆపాలని ఏపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రభుత్వానికి లేఖ రాశారు. లేఖను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నికి ఆయన పంపించారు. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ మధ్యలో ఉందని ఆయన లేఖలో పేర్కొన్నారు. అది పూర్తయ్యే వరకు జిల్లాల పునర్విభజన చేయవద్దని లేఖలో సూచించారు. ప్రస్తుతం ఉన్న 13 జిల్లాల ప్రాతిపదికన ఎన్నికల ప్రక్రియ చేపట్టామమన్నారు. జిల్లాలు పెంచితే ఎన్నికల నిర్వహణకు ఇబ్బందులు తలెత్తుతాయని రమేష్ కుమార్ తన లేఖలో పేర్కొన్నారు.
ముఖ్యంగా జిల్లా పరిషత్ ఎన్నికల నిర్వహణకు సాంకేతికంగా సమస్యలు వస్తాయన్నారు. ఎస్ఈసీ రాసిన లేఖపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందన్న అంశం ఆసక్తికరంగా మారింది. ఎస్ఈసీ సూచనలను పరిగణలోకి తీసుకుని జిల్లాల విభజన ఆపుతుందా.. లేక అలాగే ముందుకెళ్తుందా? అన్న అంశంపై భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరో సారి ఈ అంశం కోర్టుల వరకు వెళ్లే అవకాశం సైతం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఇదిలా ఉంటే.. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు సాధ్యమైనంత తొందరగా రాష్ట్రంలో కొత్త జిల్లాలను ఏర్పాటు చేయాలనే యోచనలో ఉన్న వైసీపీ ప్రభుత్వం.. ఆ దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే కొత్త జిల్లాల ప్రక్రియపై రాష్ట్రస్థాయి ఉన్నతాధికారుల వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. పలు జిల్లాల్లోని కలెక్టర్ల నేతృత్వంలో సమావేశాలు జరుగుతున్నాయి. మరోవైపు కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియపై ఇప్పటికే డీజీపీ కూడా సమావేశం నిర్వహించారు. భౌగోళిక, ఆర్థిక, సహజ వనరుల లభ్యతను బేరీజు వేసుకుని కొత్త జిల్లాల ఏర్పాటుకు కసరత్తు జరుగుతోంది. ఆదాయ వనరులతో కొత్త జిల్లాల ఏర్పాటుకు ఏపీ ప్రభుత్వం రోడ్ మ్యాప్ సిద్ధం చేస్తోంది.