మీరు రోజూ ఏటీఎంకు వెళ్తుంటారా? ఏటీఎంలో క్యాష్ డిపాజిట్ మెషీన్లో డబ్బులు డిపాజిట్ చేస్తుంటారా? అయితే అలర్ట్. ప్రైవేట్ బ్యాంకులు క్యాష్ డిపాజిట్కు ఛార్జీలు వసూలు చేస్తున్నాయి. ఇప్పటికే ఐసీఐసీఐ బ్యాంక్ ఛార్జీలను ప్రకటించింది. బ్యాంకులు పనిచేయని వేళలు, బ్యాంకులకు సెలవులు ఉన్న సమయంలో క్యాష్ డిపాజిట్ మెషీన్లో డబ్బులు డిపాజిట్ చేస్తే కన్వీనెన్స్ ఫీజు చెల్లించాలి. ఎంత మొత్తంలో క్యాష్ డిపాజిట్ చేసినా రూ.50 చెల్లించాలి. వర్కింగ్ డేస్లో సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు, బ్యాంకులకు సెలవులు ఉన్న రోజుల్లో ఈ ఛార్జీలు వర్తిస్తాయి. నవంబర్ 1 నుంచి ఈ ఛార్జీలు అమలులోకి వచ్చాయి. అయితే నెలకు రూ.10,000 లోపు క్యాష్ డిపాజిట్ చేసేవారికి ఈ ఛార్జీలు వర్తించవు. ఒకే లావాదేవీలో లేదా పలు లావాదేవీల్లో నెలకు రూ.10,000 కన్నా ఎక్కువ డిపాజిట్ చేస్తే మాత్రం కన్వీనెన్స్ ఫీజు రూ.50 చెల్లించాలి. బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్, జన్ ధన్ అకౌంట్లు ఉన్నవారితో పాటు సీనియర్ సిటిజన్లకు, అంధులకు, విద్యార్థులకు ఈ ఛార్జీలు వర్తించవు.
ఐసీఐసీఐ బ్యాంక్ మాత్రమే కాదు... మరో ప్రైవేట్ బ్యాంక్ అయిన యాక్సిస్ బ్యాంక్ ఇప్పటికే మెషీన్లో క్యాష్ డిపాజిట్లపై కన్వీనెన్స్ ఫీజు వసూలు చేస్తున్నాయి. వర్కింగ్ డేస్ రోజున సాయంత్రం 5 గంటల నుంచి ఉదయం 9.30 గంటల వరకు, సెలవులు ఉన్న రోజుల్లో క్యాష్ డిపాజిట్ చేస్తే రూ.50 వసూలు చేస్తోంది ఐసీఐసీఐ బ్యాంక్. ఆగస్ట్ 1 నుంచి యాక్సిస్ బ్యాంక్ ఈ ఛార్జీలను వసూలు చేస్తోంది. మిగతా బ్యాంకులు కూడా మెషీన్లో క్యాష్ డిపాజిట్లపై ఛార్జీలు వసూలు చేసే అవకాశం ఉంది. ఎస్బీఐలో డెబిట్ కార్డుతో క్యాష్ డిపాజిట్ చేస్తే ఎలాంటి ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు. థర్డ్ పార్టీ అకౌంట్కు డిపాజిట్ చేస్తే రూ.22+జీఎస్టీ చెల్లించాలి. కార్డ్లెస్ ట్రాన్సాక్షన్కు కూడా రూ.22+జీఎస్టీ చెల్లించాలి. కార్డ్లెస్ ట్రాన్సాక్షన్ అయితే రోజూ గరిష్టంగా రూ.49,000 వరకు డిపాజిట్ చేయొచ్చు. డెబిట్ కార్డుతో అయితే రూ.2 లక్షల వరకు డిపాజిట్ చేయొచ్చు.