♦పాఠశాలలపై నిర్ణయం రాష్ట్రాలకే
♦50% సీట్ల సామర్థ్యంతో సినిమా హాళ్లు
♦అన్లాక్ 5 మార్గదర్శకాలు నవంబర్ 30 వరకు పొడిగింపు
కేంద్ర ప్రభుత్వం సెప్టెంబర్ 30వ తేదీన జారీ చేసిన అన్లాక్-5 మార్గదర్శకాలను నవంబర్ 30 వరకు పొడిగించింది. కంటెయిన్మెంట్ జోన్ల బయట అన్నిరకాల కార్యకలాపాలకు అనుమతిస్తున్నట్లు పునరుద్ఘాటించింది. మార్చి 24వ తేదీన తొలి లాక్డౌన్ ఉత్తర్వులు జారీ చేసినప్పటి పరిస్థితులతో పోలిస్తే ప్రస్తుతానికి కంటెయిన్మెంట్ జోన్ల బయట దాదాపు అన్ని రకాల కార్యకలాపాలు క్రమంగా పునఃప్రారంభమయ్యాయని కేంద్ర హోంశాఖ మంగళవారం జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది. జనం గుమికూడటానికి సంబంధించిన కొన్ని కార్యకలాపాలను మాత్రం కొన్ని నియంత్రణలు, ప్రామాణిక నిబంధనలతో అనుమతిచ్చినట్లు గుర్తు చేసింది. అందువల్ల ఇప్పటికే మెట్రోరైళ్లు, షాపింగ్మాళ్లు, హోటళ్లు, రెస్టారెంట్లు, ఆతిథ్యసేవలు, మతకేంద్రాలు, యోగా, శిక్షణ కేంద్రాలు, వ్యాయామశాలలు, సినిమాహాళ్లు, వినోదపార్కులు తెరుచుకున్నట్లు పేర్కొంది. కొవిడ్ వైరస్ వ్యాప్తికి ఎక్కువ అవకాశం ఉన్న కార్యకలాపాల పునఃప్రారంభంపై నిర్ణయం తీసుకొనే అధికారాన్ని రాష్ట్ర ప్రభుత్వాలకే వదిలిపెట్టినట్లు తెలిపింది. ముఖ్యంగా పాఠశాలలు, కోచింగ్ సెంటర్లు, ప్రభుత్వ, ప్రైవేటు విశ్వవిద్యాలయాలు, 100 మందికి మించి జనం గుమికూడటానికి సంబంధించిన కార్యకలాపాల అనుమతిపై రాష్ట్ర ప్రభుత్వాలకే నిర్ణయాధికారం ఉంటుంది. సెప్టెంబర్ 30వ తేదీ నుంచి కేంద్ర హోంశాఖ అనుమతి ఇచ్చిన అంతర్జాతీయ విమాన ప్రయాణాలు, ఈతకొలనులు (క్రీడాకారుల కోసం) వ్యాపారుల కోసం ఎగ్జిబిషన్ హాళ్లు, 50% సీటింగ్ సామర్థ్యంతో సినిమాహాళ్లు, సామాజిక, విద్య, క్రీడ, వినోద, సాంస్కృతిక, మత, రాజకీయ సంబంధమైన సమావేశాలను నాలుగు గోడల మధ్య అయితే 50% సీట్లు లేదంటే గరిష్ఠంగా 200 మంది సామర్థ్యంతో నిర్వహించుకోడానికి అనుమతి ఇచ్చినట్లు గుర్తుచేసింది. ప్రస్తుతానికి ఇవన్నీ నవంబర్ 30వ తేదీ వరకు కొనసాగుతాయి.