ఏపీలోని నిరుద్యోగులకు సీఎం వైఎస్ జగన్ శుభవార్త చెప్పారు. పోలీసు శాఖలో 6500 పోస్టులను భర్తీ చేయనున్నట్లు ప్రకటించారు. ఈ భర్తీ ప్రక్రియ నాలుగు దశల్లో చేపడతామని చెప్పారు. పోలీసు ఉద్యోగాలను భర్తీ చేయడానికి డిసెంబర్ లో నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు సీఎం చెప్పారు. జనవరి నెలలో ఇందుకు సంబంధించిన షెడ్యూల్ విడుదల చేస్తామని స్పష్టం చేశారు. బుధవారం నిర్వహించిన పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరోనా విజృంభిస్తున్న సమయంలో పోలీసులు తమ అమూల్యమైన సేవలు అందించారని అభినందించారు. రాష్ట్రంలో మహిళలు, చిన్నారులు, వృద్ధుల రక్షణకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పారు. మహిళల రక్షణ కోసం రాష్ట్రంలో 18 దిశా పోలీస్స్టేషన్లను ఏర్పాటు చేశామన్నారు. దిశా బిల్లును కేంద్రానికి పంపించామని గుర్తు చేశారు. నేరం చేసింది ఎవరినైనా చట్టం ముందు నిలబెట్టాల్సిందేనన్నారు. సంఘ విద్రోహ శక్తులు, తీవ్రవాదాన్ని ఉపేక్షించొద్దని పోలీసులకు స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా ఏపీ హోం మంత్రి మేకతోటి సుచరిత మాట్లాడుతూ.. పోలీసులకు వారాంతపు సెలవులు ప్రకటించిన ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ మాత్రమేనన్నారు. పోలీసుల అమరవీరుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. పోలీసు శాఖలో మహిళా సిబ్బందిని ప్రోత్సహించి మహిళా సాధికారతకు ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. డీజీపీ గౌతమ్ సవాంగ్ మాట్లాడుతూ.. ప్రజల రక్షణలో అనేక మంది పోలీసులు వీరమరణం పొందారన్నారు. పోలీసులందరికీ వారు ఆదర్శమన్నారు. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో పోలీసులు కుటుంబాలకు దూరంగా ఉండి, ప్రాణాలకు తెగించి విధులు నిర్వహించారని గుర్తు చేశారు. టెక్నాలజీ ఉపయోగించడంలో ఏపీ పోలీసులకు 27 జాతీయ స్థాయి అవార్డులు వచ్చాయని వివరించారు.
ఆంధ్రప్రదేశ్ లో ప్రతి ఒక్కరికి ఏదో ఒక పథకం వర్తించేలా వైసీపీ ప్రభుత్వం ఇప్పటికే చాలా పథకాలు అమలు చేసింది. ఇందుకోసం అప్పుు చేసి మరీ పథకాలకు డబ్బు కేటాయిస్తోంది. ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన నవరత్నాల పథకాలతోపాటూ.. మరిన్ని అదనపు స్కీములను కూడా అమలు చేసింది ప్రబుత్వం. ముఖ్యంగా పేదలు, రైతులు, కార్మికులు, మహిళలు, గర్భిణులు, విద్యార్థులు, ముసలి వారు ఇలా... అన్ని వయసుల వారికీ వర్తించేలా ప్రభుత్వ పథకాలున్నాయి. తాజాగా మరో సంక్షేమ కార్యక్రమాన్ని ప్రారంభిస్తోంది ప్రభుత్వం.
రేషన్ కార్డు ఉండి.కుటుంబలో ఎవరికైనా ప్రమాదం జరిగితే వారిని ఆర్ధికంగా ఆదుకునేందుకు వైఎస్సార్ బీమా పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకాన్ని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇవాళ ప్రారంభించబోతున్నారు. ఈ పధకం ద్వారా రాష్ట్రంలో 1.41 కోట్ల బియ్యం కార్డు ఉన్న కుటుంబాలకు ప్రయోజనం కలగనుంది. ఇందుకోసం ఏడాదికి రూ.583.50 కోట్లు ఖర్చు చేయబోతోంది ప్రభుత్వం. పథకం అమల్లో ఎక్కడా ఎలాంటి సమస్యలూ రాకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి.