ఏపీలో కొత్తగా పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకునే వారు ఆధార్ అప్డేట్ హిస్టరీ తప్పనిసరిగా పరిశీలించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కొందరు ఆధార్ కార్డులో తమ వయసును మార్చుకొని పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకుంటున్నట్లు ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి. ఈ క్రమంలో అనర్హులు లబ్దిపొందకుండా చూసేందుకు ప్రభుత్వం ఈ కొత్త నిబంధనను తీసుకొచ్చినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ఈ నిబంధన ప్రకారం పింఛనుకు దరఖాస్తు చేసుకునేవారు తమ ఆధార్ కార్డు అప్డేట్ హిస్టరీ ప్రింటౌట్ ఇవ్వాల్సి ఉంటుంది.
ఇక అందులో మార్పులు, చేర్పులు జరిగి ఉంటే
ఆధార్ కార్డులోని తక్కువ వయసును పరిగణనలోని తీసుకుంటారు. అర్హత ఉంటేనే ఆ దరఖాస్తును తదుపరి దశ పరిశీలనకు పంపుతారు. లేదంటే సచివాలయల్లో డిజిటల్ అసిస్టెంట్ స్థాయిలోనే ఆ దరఖాస్తును తిరస్కరిస్తారు.
ఇక దరఖాస్తుదారుకి ఆధార్ కార్డు మంజూరు సమయంలో వయసు తప్పుగా నమోదై, తిరస్కరణకు గురై ఉంటే వారు అప్పీలు చేసుకోవడానికి కూడా ప్రభుత్వం అవకాశం కల్పించింది. అలాంటి వారు వయసు ధ్రువీకరణ పత్రాలతో గ్రామ, వార్డు సచివాలయంలో అప్పీలు చేసుకోవచ్చునని సూచించింది. ఈ అప్పీళ్లను ఎంపీడీవోలు లేదా మున్సిపల్ కమిషనర్లు స్వయంగా పరిశీలిస్తారని.. అర్హులైతే వారికి పింఛను మంజూరుకు డీఆర్డీఏ పీడీలకు సిఫార్సు చేస్తారని తెలిపారు.