Government-stopped half wages clarified in DAs in 5 installments
డీఏలపై స్పష్టత ఇచ్చిన ప్రభుత్వం-ఆపిన సగం వేతనాలు 5 విడతల్లో
సీఎంకు ఏపీ జేఏసీ అమరావతి, ఏపీజీఈఏ కృతజ్ఞతలు
ఉద్యోగులకు పెండింగ్లో ఉన్న డీఏల చెల్లింపుపై ప్రభుత్వం అధికారిక ప్రకటన చేసింది. ప్రస్తుతం ఉద్యోగులకు 5 డీఏలు పెండింగ్లో ఉన్నాయి. వీటిలో 3 డీఏల చెల్లింపులపై ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. విడతల వారీగా 2022 వరకు వీటిని చెల్లించనున్నారు. ఈ మేరకు శనివారం ఓ ప్రకటనలో పేర్కొంది. 2019 చివరి డీఏ 2022 వరకు ఉద్యోగులు ఎదురు చూడాల్సిందే. 2018 జూలై నుంచి 2019 డిసెంబరు వరకు 3 డీఏలు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగ్లో ఉన్నాయి. 2020 జనవరి నుంచి రావాల్సిన డీఏను కేంద్ర ప్రభుత్వం వాయిదా వేసింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రస్తుతం 3 డీఏలు పెండింగ్లో ఉన్నాయి. వీటిలో ఒక డీఏను జనవరి 2021 నుంచి, రెండో డీఏను జూలై 2021 నుంచి, మూడో డీఏను జనవరి 2022 నుంచి చెల్లిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. కేంద్రప్రభుత్వానికి సంబంధించి డీఏల అంశం సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉంది. కోర్టు తీర్పు ఉద్యోగులకు అనుకూలంగా వస్తే కేంద్రమైనా చెల్లించక తప్పదు. కరోనా కారణంగా మార్చి, ఏప్రిల్కు గాను నిలిపివేసిన సగం వేతనాలను ఐదు విడతల్లో చెల్లిస్తారు. తొలి విడత నవంబరు నెల వేతనంలో చెల్లించనున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు.
పెండింగ్ జీతాల చెల్లింపునకు ఆమోదం: బొప్పరాజు
కరోనా లాక్డౌన్ కారణంగా మార్చి, ఏప్రిల్కు సంబంధించి ప్రభుత్వ ఉద్యోగులకు నిలిపేసిన 50శాతం జీతాన్ని విడుదల చేసేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపిందని ఏపీ జేఏసీ అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు తెలిపారు. నవంబరు, డిసెంబరు, జనవరిలో మూడు విడతలుగా ఉద్యోగులు, పెన్షనర్లకు చెల్లిస్తుందన్నారు. ఇందుకు సీఎం జగన్కు తమ అసోసియేషన్ తరఫున ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కాగా, ఉద్యోగుల పెండింగ్ జీతాలు, డీఏ చెల్లింపుపై సీఎం జగన్ నిర్ణయం తీసుకోవడం సంతోషకరమని ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ చైర్మన్ వెంకట్రామిరెడ్డి అన్నారు. ఉద్యోగుల సమస్యలు పరిష్కరించినందుకు సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు.