- ఆర్బీఐ అంచనా
- వడ్డీ రేట్లు యథాతథం
- ద్రవ్యోల్బణం 6.8 శాతానికి చేరొచ్చు
- అన్ని వేళల ఆర్టీజీఎస్ సేవలు
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత జీడీపీ మైనస్ 9.5 శాతానికి క్షీణించే అవకాశాలున్నాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంత్ దాస్ అన్నారు. కరోనా సంక్షోభం పరిస్థితి ఈ ఏడాది డిసెంబర్ ముగింపు వరకు కొనసాగవచ్చని పరోక్షంగా తెలిపారు. వచ్చే ఏడాది జనవరి- మార్చి త్రైమాసికంలో జీడీపీ తిరిగి రికవరీ అయ్యే అవకాశాలున్నాయని తెలిపారు. మూడు రోజుల పాటు సాగిన ద్రవ్య పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) సమావేశం నిర్ణయాలను శుక్రవారం శక్తికాంత దాస్ మీడియాకు వెల్లడించారు. నాలుగు శాతానికి దిగువన ద్రవ్యోల్బణం కట్టడి చేయాలన్న లక్ష్యం కూడా కరోనా వల్ల అదుపు తప్పిందన్నారు. అహార ధరలు ఎగిసిపడటంతో గత ఆరు నెలలుగా వినియోగ ధరల ద్రవ్యోల్బణం(సీపీఐ) 6 శాతం కంటే అధికంగా నమోదవుతున్న విషయం తెలిసిందే. గడిచిన ఆగస్ట్ నెలలోనూ సీపీఐ 6.69 శాతంగా చోటు చేసుకుంది. భారత జీడీపీ 9.6 శాతం కోల్పోవచ్చని ఇంతక్రితం రోజు ప్రపంచ బ్యాంక్ ఓ రిపోర్ట్లో అంచనా వేసిన విషయం తెలిసిందే. ప్రస్తుత త్రైమాసికంలో ప్రపంచ ఆర్థిక కార్యకలాపాలు పుంజుకున్నట్టు కనిపిస్తున్నాయని దాస్ పేర్కొన్నారు. ప్రస్తుతం దేశం రికవరీపై దృష్టి పెట్టాల్సిన సమయమని పేర్కొన్నారు. వ్యవసాయం, కన్సూమర్ గూడ్స్, పవర్, ఫార్మా రంగాలు వేగంగా రికవర్ అయ్యే వీలుందన్నారు. ప్రస్తుతం ఆర్బీఐ వద్ద సరిపడ నగదు ఉందన్నారు. ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ (ఓఎంసీ) వేలం ద్వారా రూ.20,000 కోట్ల నిధులు సమీకరించనున్నట్టు తెలిపారు. ఈ దఫా జరిగిన ఎంపీసీ భేటీలో వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగించాలని నిర్ణయించారు. వడ్డీ రేట్లను యధాతథంగా ఉంచినట్టు దాస్ తెలిపారు. ప్రస్తుతం ఉన్న రెపో, రివర్స్ రెపోలో ఎలాంటి మార్పు చేయలేదన్నారు. దీంతో వడ్డీ రేట్లకు కీలకమైన రెపో రేటు 4 శాతంగా, రివర్స్ రెపో 3.35 శాతం వద్ద, మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ రేటు 4.2 శాతంగా కొనసాగనున్నాయి. 2019 ఫిబ్రవరి మొదలు ఆర్బీఐ ఇప్పటివరకూ రెపో రేటులో 2.5 శాతం కోత విధించింది. 2020 ఫిబ్రవరి నుంచి చూస్తే 1.15 శాతం తగ్గించింది.
నగదు బదిలీలో మార్పు.
నగదు బదిలీలకు సంబంధించిన రియల్ టైమ్ గ్రాస్ సెటిల్ మెంట్ (ఆర్టీజీఎస్) సేవలను వచ్చే డిసెంబర్ నుంచి అన్ని సమయాల్లో అందుబాటులో ఉంచనున్నట్టు ఆర్బీఐ ప్రకటించింది. ప్రస్తుతం ఆర్టీజీ ఎస్ సేవలు బ్యాంక్ పని దినాల్లో మాత్రమే ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆర్బీఐ 24 గంటలు ఆర్టీజీఎస్ సేవలు అందించాలని నిర్ణయించింది. గత ఏడాది డిసెంబర్ 16 నుంచి నెఫ్ట్ సేవలను 24 గంటలపాటు అందుబాటులోకి తెచ్చిన విషయం తెలిసిందే. నెఫ్ట్ ద్వారా 2లక్షలు అంతకులోపు నగదును మాత్రమే బదిలీ చేసుకునే అవకాశం ఉంటుంది. అంతకుమించి నగదు బదిలీ చేయాలంటే ఆర్టీజీఎస్ సేవలు తప్పనిసరి.