రెండు డీఏ లపై అధికారిక ప్రకటన
నేడో, రేపో వచ్చే అవకాశం
నవంబరు జీతంతో ఒకటి
జనవరి జీతంతో మరొకటి
మొత్తానికి దసరా పండగకు ఉద్యోగులకు శుభవార్త వినిపించింది. వరుసగా రెండు డీఏ లు ఇచ్చేందుకు ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయానికి వచ్చింది. గురు, శుక్ర వారాల్లో ప్రభుత్వానికి, ఉద్యోగ సంఘాలకు మధ్య సాగిన వివిధ చర్చల ప్రక్రియ కొలిక్కి వచ్చే సరికి పెండింగులో ఉన్న వాటిలో రెండు డీఏలు ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేసింది.ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగులకు డీ ఏ లు ఇవ్వబోతున్నామని ప్రభుత్వమే అధికారికంగా ప్రకటించేందుకు ఆలోచిస్తోంది. బహుశా శనివారమే దసరా పండగ సందర్భంగా అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని ‘ ఉద్యోగులు న్యూస్‘ కు సమాచారం అందింది. నవంబరు నెల జీతంతో పాటు డిసెంబర్ లో ఒక డీఏ, జనవరి నెల జీతంతో పాటు ఫిబ్రవరి నుంచి మరో డీఏ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారని తెలిసింది. ప్రభుత్వానికి సన్నిహితంగా ఉండే ఒక నాయకుడు ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులపై ఒత్తిడి తీసుకువచ్చారు. ఉద్యోగ సంఘాలుగా తాము ప్రకటించడం కాదని ప్రభుత్వం తరఫున ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించాలని ఆయన సూచించారు. దసరా కానుకగా ఉద్యోగులకు రెండు డీఏ లను ప్రభుత్వమే ప్రకటన రూపంలో వెల్లడించాలని సూచించారు. తెలంగాణలో కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా డీఏ పై శుక్రవారం అధికారికంగా ప్రకటన చేశారు. ఉత్తర్వులు కూడా వెలువడ్డాయి. ఉద్యోగ సంఘ నాయకులం బయట ఎంత చెప్పినా ప్రభుత్వ ప్రకటనకు ఉండే విలువ ముఖ్యమైందని ఆ నేత ప్రభుత్వ పెద్దలకు చెప్పినట్లు తెలిసింది.