Bumper offer for those who do not take a moratorium
ఇటీవల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లోన్ మారటోరియం ప్రకటించింది. అంటే, కరోనా వైరస్ లాక్ డౌన్ వల్ల చాలా మంది ఉపాధి కోల్పోవడం, ఆదాయం తగ్గిపోవడంతో తీసుకున్న రుణాలు కట్టే పరిస్థితి లేకపోయింది. దీంతో ఆర్బీఐ లోన్ మారటోరియం తీసుకొచ్చింది. మార్చి 1 నుంచి ఆగస్టు 31 వరకు ఈ లోన్ మారటోరియం అమల్లో ఉంది. బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్న వారు దీన్ని వినియోగించుకోవచ్చని ఆర్బీఐ ప్రకటించింది. చిన్న- మధ్య తరహా కంపెనీలు, విద్య, హౌసింగ్, క్రెడిట్ కార్డు చెల్లింపులు, ఆటో లోన్స్, పర్సనల్ లోన్స్ లాంటి రుణాలు తీసుకున్న వారిలో చాలా మంది ఈ లోన్ మారటోరియంను వినియోగించుకున్నారు. అయితే, ఈ లోన్ మారటోరియంను వినియోగించుకున్న వారికి బ్యాంకులు షాక్ ఇచ్చాయి.
వారు ఎన్ని నెలల పాటు వినియోగించుకుంటే అన్ని నెలలకు సంబంధించి వడ్డీల మీద వడ్డీని విధించాయి. ఆ వడ్డీ మీద వడ్డీని మాఫీ చేయడానికి కేంద్రం సంకల్పించింది. ప్రస్తుతం ఈ కేసు సుప్రీంకోర్టులో ఉంది.
అయితే, లోన్ మారటోరియం వినియోగించుకున్న వారి సంగతి సరే. మరి వినియోగించుకోని వారి సంగతి ఏంటి? కరోనా కష్ట కాలంలో కూడా కష్టపడి రుణాలు చెల్లించిన వారి సంగతి ఏంటి? వారికి ఏదో ఒక రకంగా లబ్ధి చూపించాలి కదా అనే అభిప్రాయం కేంద్ర ప్రభుత్వంలో ఉన్నట్టు తెలుస్తోంది. లోన్ మారటోరియం తీసుకోని వారికి లబ్ధిచేకూర్చేలా ఓ నిర్ణయం తీసుకోనున్నట్టు సమాచారం. లోన్ మారటోరియం తీసుకోకుండా నెలనెలా రుణాల ఈఎంఐలు చెల్లించిన వారికి రివార్డు ఇవ్వాలని కేంద్రం భావిస్తోందని టైమ్స్ ఆఫ్ ఇండియా కథనంలో పేర్కొంది. రూ.2 కోట్ల లోపు రుణం తీసుకున్న వ్యక్తులు, చిన్న-మధ్య తరహా కంపెనీలకు క్యాష్ బ్యాక్ ఇచ్చేందుకు కేంద్రం ప్లాన్ చేసినట్టు తెలిపింది.'లోన్ మారటోరియంను చాలా మంది తీసుకున్నారు. మరి అంత కష్టంలో కూడా రుణాలు చెల్లించిన వారిని గౌరవించాలి కదా. లేకపోతే అది సమంజసం కాదు.' అని ఓ ప్రభుత్వ ఉన్నతాధికారిని ఉటంకిస్తూ ఆ కథనంలో పేర్కొంది. అయితే, ప్రస్తుతం వడ్డీ మీద వడ్డీని మాఫీ చేసే అంశం సుప్రీంకోర్టు పరిధిలో ఉంది. ఆ తర్వాత ఈ అంశంపై కేంద్రం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
ICRA వైస్ ప్రెసిడెంట అనిల్ గుప్తా మాట్లాడుతూ 'లోన్ మారటోరియంను మెజారిటీ మంది వినియోగించుకున్నారు. ఇలా లోన్ మారటోరియంను వినియోగించుకోని వారికి లబ్ధిచేకూర్చడానికి కేంద్రానికి పెద్దగా ఖర్చు కూడా కాదు. కేవలం రూ.5000 కోట్ల నుంచి రూ.7000 కోట్లు ఖర్చు అవొచ్చు.అని అన్నారు. అయితే, దీనికి పెద్ద ఎత్తున కసరత్తు చేయాల్సి ఉంది. ఎందుకంటే ఆర్బీఐ లోన్ మారటోరియం ఆరు నెలల పాటు ఇచ్చింది. అందులో కొందరు ఆరు నెలల పాటు మారటోరియంను వినియోగించుకున్నారు.మరికొందరు కేవలం 2 నెలలు మాత్రమే వినియోగించుకుని, ఆ తర్వాత నాలుగు నెలలు తమ ఈఎంఐలు చెల్లించారు. కొందరు మూడు నెలలు, కొందరు నాలుగు నెలలు మారటోరియంలు వినియోగించుకుని ఉండొచ్చు. కాబట్టి, అలాంటి వారికి ఎలా బెనిఫిట్ ఇస్తారనేది కూడా కేంద్రం పరిశీలించాల్సి ఉంటుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.