ఏపీలోని అనేక జిల్లాల్లో రాబోయే మూడు రోజుల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.
మధ్య బంగాళాఖాతంలో ఈ రోజు ఏర్పడిన అల్పపీడనం మరింత తీవ్రంగా మారే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.
ఇది రాబోయే 48 గంటలలో వాయువ్య దిశగా ప్రయాణించి ఆ తరువాత మూడు రోజుల్లో ఉత్తర ఈశాన్య దిశగా ప్రయాణించే అవకాశం ఉందని పేర్కొంది.
దీని కారణంగా ఏపీలో రాబోయే మూడు రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవొచ్చని వాతావరణ కేంద్రం అంచనా వేసింది.
ఈ రోజు ఉత్తర కోస్తా ఆంధ్రాలోని తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలలో భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని తెలిపింది. రేపు ఎల్లుండి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలలో అక్కడక్కడ భారీ వర్షాలు పడొచ్చని వెల్లడించింది.
దక్షిణ కోస్తాలోని కృష్ణా, గుంటూరు జిల్లాలలో భారీ నుండి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని.. నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు పడొచ్చని అంచనా వేసింది.
ఇక నేడు కర్నూలు జిల్లాలో భారీ నుండి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని.అనంతపురం, చిత్తూరు జిల్లాలలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. రాబోయే రెండు రోజుల్లోనూ రాయలసీమలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడొచ్చని అమరావతి కేంద్రం పేర్కొంది.