Jagananna Vidya Kanuka-రేపు జగనన్న విద్యాకానుక ప్రారంభం-విద్యార్థులకు వరం
ఏపీ ప్రభుత్వం అప్పులు తెచ్చి మరీ కొత్త పథకాలు ప్రారంభిస్తోంది. రాష్ట్రానికి ఆదాయం పడిపోయినా. పథకాలకు నిధులు మాత్రం కేటాయిస్తోంది. జగనన్న విద్యాకానుక పథకం పూర్తి వివరాలు తెలుసుకుందాం.
పాఠశాలల్లో పిల్లల నమోదును గణనీయంగా పెంచడంతో పాటు, అభ్యాసనలో వారు ఉత్సాహంగా పాల్గొనేలా చేయడం ద్వారా మెరుగైన ఫలితాలు సాధించడమే ధ్యేయంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. పిల్లలను బడిలో చేర్చే సమయంలో ఖర్చుల కోసం పేద కుటుంబాలు పడుతున్న కష్టాల నుంచి విముక్తి కలిగించడంతో పాటు, పాఠశాలల్లో ‘డ్రాప్ అవుట్‘ లను గణనీయంగా తగ్గిస్తూ, బాలల బంగారు భవిష్యత్తుకు బాటలు వేయడమే లక్ష్యంగా ‘జగనన్న విద్యాకానుక’ పథకాన్ని ప్రభుత్వం అమలు చేయబోతోంది. కృష్ణా జిల్లా కంకిపాడు మండలం, పునాదిపాడు ప్రభుత్వ పాఠశాలలో గురువారం (8-10-2020) ఈ కార్యక్రమాన్ని ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రారంభిస్తారు.
ఏమిటి ‘జగనన్న విద్యా కానుక
ప్రభుత్వ పాఠశాలల్లో చదివే 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు అందరు విద్యార్థినీ, విద్యార్థులకు ఈ కార్యక్రమంలో ప్రత్యేక స్కూల్ కిట్లు అందజేయనున్నారు. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని 42,34,322 మంది విద్యార్థులకు ప్రయోజనం కలగబోతోంది. సుమారు రూ.650 కోట్ల విలువైన స్టడీ కిట్లను విద్యార్థులకు ఇస్తారు.
కిట్లో ఏముంటాయి
జగనన్న విద్యా కానుక కింద పిల్లలకు అందజేసే కిట్లో 3 జతల యూనిఫారాలు, ఒక జత బూట్లు, రెండు జతల సాక్సులు, బెల్టు, ఒక సెట్ టెస్ట్ బుక్స్, నోటు బుక్స్, వర్క్ బుక్స్, ఒక స్కూల్ బాగ్ ఉంటాయి. ఇప్పటి వరకు దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థినీ, విద్యార్థులందరికీ ఆ కిట్లు ఇవ్వబోతున్నారు. దీంతో పాటు పిల్లలకు ఇస్తున్న యూనిఫామ్ కుట్టు కూలీ మూడు జతలకి రూ.120 చొప్పున తల్లుల అకౌంట్కే నేరుగా విడుదల చేస్తారు. స్కూళ్లు తెరిచే నాటికి పిల్లలు యూనిఫామ్లు కుట్టించుకునే విధంగా వారికి ముందుగానే ఈ కిట్లు ఇస్తున్నారు.