AP schools to reopen from November 2nd: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నవంబర్ 2వ తేదీ నుంచి పాఠశాలలు తిరిగి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు నిర్ణయించిన ఏపీ ప్రభుత్వం పాఠశాలలకు నిర్దిష్టమైన ఆంక్షలతో కూడిన ఆదేశాలను జారీ చేసింది. ఈ విషయంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్వయంగా మంగళవారం నాడు కీలక వ్యాఖ్యలు చేశారు.
నవంబరు 2న స్కూళ్లు ప్రారంభం అవుతాయి.. 1, 3, 5, 7 తరగతులకు ఒక రోజు, 2,4, 6, 8 తరగతులకు మరో రోజు తరగతులు నిర్వహిస్తారు.. ఒక వేళ విద్యార్థుల సంఖ్య 750కి పైగా ఉంటే మూడు రోజులకు ఒకసారి తరగతులు నిర్వహిస్తారు.. అదే విధంగా స్కూళ్లు కేవలం మధ్యాహ్నం వరకు మాత్రమే పని చేస్తాయి.
మధ్యాహ్న భోజనం పెట్టి విద్యార్థులను ఇంటికి పంపిస్తారు.నవంబరు నెల అంతా ఇది అమలవుతుంది.డిసెంబరులో పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది.. ఒక వేళ తల్లిదండ్రులు తమ పిల్లలను బడికి పంపకపోతే, వారి కోసం ఆన్లైన్ తరగతులు నిర్వహిస్తాం-అని ముఖ్యమంత్రి వివరించారు.
గత మార్చిలో లాక్ డౌన్ సమయంలో మూతపడిన పాఠశాలలు తిరిగి తెరిచేందుకు ప్రభుత్వం పలు మార్లు యోచించి… తగిన ఆంక్షలతో పాఠశాలలు తెరవాలని నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వం పాఠశాలల పున:ప్రారంభంపై నిర్ణయం తీసుకునే వెసులుబాటును రాష్ట్ర ప్రభుత్వాలకే వదిలేసిన నేపథ్యంలో గత 20 రోజులుగా పలు అంశాలను పరిగణలోకి తీసుకున్న ఏపీ ప్రభుత్వం నిర్దిష్టమైన ఆంక్షలతో పాఠశాలలు తిరిగి తెరవాలని నిర్ణయించింది. ఈ ఆంక్షలపై ముఖ్యమంత్రి స్వయంగా ప్రకటన చేయడం విశేషం.