AP Jala Jeevan machine-ప్రతీ ఇంటికి కుళాయి. ఏపీ సర్కార్ కీలక నిర్ణయం
ఏపీలో వైఎస్ జగన్ సర్కార్ మరో కీలక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. పట్టణాల మాదిరిగా పల్లెల్లోనూ ఇంటింటికీ మంచి నీటి కుళాయిలు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. ఇందు కోసం భారీగా నిధులను కేటాయించింది. ఇందుకు సంబంధించిన నిధుల కోసం సోమవారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రూ. 4,800.59 కోట్ల విడుదలకు అనుమతి ఇచ్చింది. గ్రామీణ మంచినీటి సరఫరా విభాగం అధికారుల లెక్కల ప్రకారం. ఏపీలోని గ్రామీణ ప్రాంతాల్లో మొత్తం 91,40,605 నివాస గృహాలు ఉన్నాయి. అయితే వాటిలోని 33,88,160 ఇళ్లకు ఇప్పటికే మంచినీటి కనెక్షన్లు ఉన్నాయి. అవి పోనూ నీటి కుళాయి కనెక్షన్లు లేని 57,52,445 ఇళ్లకు ఇప్పుడు నూతన కనెక్షన్లు ఏర్పాటు చేయనున్నారు.
- ఇందుకోసం రూ.10,975 కోట్లతో అధికారులు ప్రణాళికలు రూపొందించారు.
జలజీవన మిషన్ ద్వారా 50 శాతం నిధులు.. జలజీవన మిషన్ పథకం ద్వారా 50% నిధులను కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఇవ్వనుంది. ఈ పథకం తొలి దశలో భాగంగా రాష్ట్రంలో 32 లక్షల ఇళ్లకు నీటి కనెక్షన్ల ఏర్పాటు చేయనున్నారు. ఇందు కోసం రూ.4,800.59 కోట్ల నిధుల మంజూరుకు అధికారులు ప్రతిపాదనలు పంపించారు. అధికారుల ప్రతిపాదనలకు ప్రభుత్వం ఓకే చెప్పింది.
ప్రతీ వ్యక్తికి నిత్యం 55 లీటర్లు.
గ్రామీణ ప్రాంతంలోని ప్రతీ వ్యక్తికి నిత్యం 43.5 లీటర్ల నుంచి 55 లీటర్ల నీరు అందించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకు అనుగుణంగా మంచినీటి పథకాలు నిర్మించి ఉన్న దగ్గర తొలి దశ కింద కొత్తగా కుళాయి కనెక్షన్లను ఏర్పాటు చేసేందుకు అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఒక్కొక్కరికీ నిత్యం 43.5 లీటర్ల కంటే తక్కువగా నీరు సరఫరా జరుగుతున్న దగ్గర సైతం ఆ పరిమాణం పెంచనున్నారు. ఆ ప్రాంతాల్లో నిర్మించి ఉన్న మంచినీటి పథకాల సామర్థ్యం పెంచనున్నారు. రెండో దశలో మరిన్ని కుళాయి కనెక్షన్లు ఇవ్వనున్నారు. మిగిలిన 25.52 లక్షల నివాసాలకు రెండో దశలో కుళాయిలు ఏర్పాటు చేసేందుకు అధికారులు ప్రణాళికలు రూపొందించారు.