♦హైకోర్టు ఆదేశాలు, సూచనల మేరకే
♦29న సవరించిన తేదీల ప్రకటన: ఏపీపీఎస్సీ
♦గతంలో క్వాలిఫై అయిన వారందరూ రాయొచ్చు
♦5 ప్రశ్నల వల్ల మరికొందరికి మెయిన్స్ రాసే అవకాశం
గ్రూప్-1 ప్రధాన పరీక్షలు(మెయిన్స్) మరోసారి వాయిదా పడ్డాయి. షెడ్యూల్ ప్రకారం నవంబరు 2 నుంచి 13వరకు మెయిన్స్ జరగాల్సి ఉంది. హైకోర్టు ఆదేశాలు, సూచనల మేరకు వాయిదా వేస్తున్నట్లు ఏపీపీఎస్సీ కార్యదర్శి పీఎస్ఆర్ ఆంజనేయులు గురువారం తెలిపారు. మెయిన్స్ నిర్వహణకు సవరించిన తేదీలను 29న ప్రకటిస్తామన్నారు. ఇప్పటికే మెయిన్స్ రాసేందుకు అర్హత సాధించిన అభ్యర్థుల జాబితాలో మార్పు ఉండబోదని, వారం తా పరీక్ష రాయొచ్చని స్పష్టం చేశారు. ప్రిలిమ్స్లో 5 ప్రశ్నలకు జవాబులను పునఃపరిశీలించి, ఆ మేరకు తుది జాబితాను రూపొందించాలని హైకోర్టు ఆదేశించిన ఫలితంగా మరికొంతమందికి మెయిన్స్ రాసే అర్హత లభించే అవకాశం ఉండొచ్చు. ఆ ఐదు ప్రశ్నల జవాబులను నిపుణుల కమిటీకి పంపించి, పునఃపరిశీలన తర్వాత.. అదనంగా ఎంతమందికి అర్హత వస్తుందనేదానిపై స్పష్టత రానుంది.
తప్పులను పునఃసమీక్షించుకోని ఫలితమే.
రాష్ట్రస్థాయిలో అత్యంత కీలకమైన గ్రూప్-1 సర్వీసెస్ రిక్రూట్మెంట్ ప్రక్రియలో ప్రతి అడుగూ ముఖ్యమైనదే. నోటిఫికేషన్ నుంచి ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షల నిర్వహణ, ప్రశ్నపత్రాల సెట్టింగ్, అందులో కచ్చితత్వంపై లక్షలాది మంది అభ్యర్థులు సునిశిత దృష్టి సారిస్తారు. కేవలం నిపుణుల కమిటీ సిఫారసుల్ని ఏపీపీఎస్సీ గుడ్డిగా నమ్మటం వల్ల అనేక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ప్రశ్నపత్రాల సెట్టర్స్ నిర్లక్ష్యం వల్ల అసాధారణంగా తప్పులు, పొరపాట్లు జరుగుతున్నాయి.
ప్రాథమిక కీలో తప్పులపై అభ్యంతరాలను క్షుణ్నంగా పరిశీలించినట్లయితే చాలావరకు సమస్య పరిష్కారమవుతుంది. కానీ, ఫైనల్ కీలోనూ ఎన్నో తప్పులు కొనసాగుతున్న ఫలితంగా మెయిన్స్ నిర్వహణ గందరగోళంలో పడుతోంది. పొరపాట్లపై వ్యక్తమవుతున్న అభ్యంతరాలపై పునఃసమీక్ష లేని ఫలితంగా ఏపీపీఎస్సీ పరీక్షలపైనే నిరుద్యోగులకు అనుమానాలు వ్యక్తమయ్యే పరిస్థితులు నెలకొన్నాయి. 2018 డిసెంబరులో గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదలైంది. 2019 మేలో ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించారు. ప్రైమరీ కీలో తప్పులపై అభ్యర్థులు అభ్యంతరాలు వ్యక్తం చేశారు.
నిపుణుల కమిటీ సిఫారసు మేరకు ఫైనల్ కీని విడుదల చేయగా అందులోనూ తప్పులు ఉన్నాయని, తెలుగు అనువాదంలో అనేక దోషాలు దొర్లాయని, ప్రిలిమ్కు క్యాలిక్యులేటర్ అనుమతిస్తామని నోటిఫికేషన్లో పేర్కొన్నప్పటికీ పరీక్షలో అనుమతించలేదని పలువురు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించగా, ప్రిలిమ్స్ ఫలితాలను వెల్లడించరాదని స్టే ఇచ్చిది. అయితే కీలో తప్పిదాలను సరిదిద్ది, ఫైనల్ కీని విడుదల చేసి, ఫలితాలు వెల్లడిస్తామని, తుది తీర్పునకు లోబడి ప్రక్రియ ఉంటుందని ఏపీపీఎస్సీ హైకోర్టుకు వివరించింది. గతేడాది అక్టోబర్లో స్టే తొలగించి వివరణాత్మక కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా కోర్టు ఏపీపీఎస్సీని ఆదేశించింది. నవంబరు 1న తుది కీ విడుదల చేసి ప్రిలిమ్స్ ఫలితాలను విడుదల చేశారు. కానీ, తుది కీలో కూడా పలు తప్పులు ఉన్నాయని అభ్యర్థులు మళ్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఏపీపీఎస్సీ న్యాయ సలహా తీసుకోగా, కేసులు తేలకుండా మెయిన్స్ నిర్వహిస్తే తుది తీర్పు వెలువడ్డాక.. పరీక్ష రద్దు చేసి.. కొత్త జాబితా విడుదల చేసి మళ్లీ మెయిన్స్ నిర్వహించవలసి వస్తుందని పేర్కొన్నట్టు తెలిసింది. అయినప్పటికీ ఏపీపీఎస్సీ స్పష్టమైన ప్రకటన చేయకుండానే మెయిన్స్ నిర్వహించేందుకు సన్నద్ధమైం ది. 2011నాటి గ్రూప్-1 నోటిఫికేషన్లోనూ ప్రిలిమ్స్ కీ తప్పులకు సుప్రీం తీర్పు మేరకు ప్రధాన పరీక్ష, ఇంటర్వ్యూ రద్దుచేసి దాదాపు ఆరేళ్ల తర్వాత రీ ఎగ్జామ్ నిర్వహించారు.