న్యాయ వివాదాల కారణంగా నిలిచిపోయిన 2018 డీఎస్సీ సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టుల భర్తీకి మంత్రి ఆదిమూలపు సురేశ్ షెడ్యూల్ ప్రకటించారు.
2018 డీఎస్సీ నోటిఫికేషన్లో 3,524 సెకండరీ గ్రేడ్ పోస్టుల భర్తీకి ప్రకటన ఇచ్చారు.
ఆ తర్వాత పరీక్షల నిర్వహణ, మెరిట్ జాబితాల రూపకల్పన చేసి 2,203 మంది ధ్రువపత్రాలను ఆయా జిల్లాల విద్యాధికారులు పరిశీలన చేశారు. వ్యాజ్యాల కారణంగా ఆ ప్రక్రియ అప్పట్లో నిలిచిపోయింది.
ఇంకా 1,321 మంది ధ్రువపత్రాలను పరిశీలన చేయాల్సి ఉంది. బుధవారం ఈ పోస్టులకు అర్హత సాధించిన వారి మొబైల్ నెంబర్లకు సంక్షిప్త సందేశాలను పంపిస్తారు.
అనంతరం వారు తమ ధ్రువపత్రాలను సంబంధిత వెబ్సైట్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఎంపికైనవారు ఈనెల 24న ఆయా జిల్లాల విద్యాశాఖాధికారి కార్యాలయాల్లో ఒరిజినల్ ధ్రువపత్రాల పరిశీలనకు హాజరుకావాలి.
అదే రోజు ఆయా జిల్లాల్లోని 3, 4 కేటగిరీలు, ఇతర మారుమూల ప్రాంతాల్లోని స్కూళ్లలోని ఖాళీల జాబితాను డీఈవో ఆఫీస్ పోర్టళ్లలో ప్రదర్శిస్తారు. ఎంపికైన అభ్యర్థులకు ఈనెల 25, 26 తేదీల్లో కౌన్సెలింగ్ నిర్వహించి అదే రోజున నియామక ఉత్తర్వులు అందిస్తారు.
ఈనెల 28న తమకు కేటాయించిన స్కూళ్లలో చేరాల్సి ఉంటుంది.
కాగా ఇప్పటికీ పలు వ్యాజ్యాల కారణంగా నిలిచిపోయిన మరికొన్ని కేటగిరీలకు సంబంధించిన మొత్తం 949 పోస్టులను కూడా కోర్టు కేసుల పరిష్కారం అనంతరం నియామకాలు చేయనున్నట్లు పేర్కొన్నారు. ఆయా పోస్టుల్లో 374 స్కూల్ అసిస్టెంట్ (తెలుగు, లాంగ్వేజ్ పండిట్స్-తెలుగు) పోస్టులు, 486 పీఈటీలు, ఫిజికల్ డైరెక్టర్లు, 89 ప్రిన్సిపాల్స్ పోస్టులున్నాయి.