Read also:
Prime Minister Modi has given key directions to several states, including AP, on lockdowns
దేశంలోని పలు రాష్ట్రాల్లో కరోనా వైరస్ కేసులు రోజురోజుకు భారీగానే రికార్డు అవుతున్నాయి. ఈ క్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ కీలక సూచనలు చేశారు. ఏడు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్లో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. కరోనా వైరస్ కట్టడి పేరుతో రాష్ట్రాలు ఒకటి, రెండు రోజుల పాటు లాక్ డౌన్ను విధిస్తున్నాయి. దీనిపై రాష్ట్రాలు ఓసారి ఆలోచించాలని ప్రధాని సూచించారు. దీని వల్ల ఆర్థిక వ్యవస్థ మీద ప్రభావం పడుతుందని చెప్పారు. కరోనా వైరస్ను కట్టడి చేసేందుకు రాష్ట్రాలు ట్రేసింగ్, ట్రాకింగ్ వ్యవస్థను సమర్థంగా వినియోగించుకోవాలన్నారు. 'లాక్ డౌన్ ప్రయోజనాలను ఇచ్చింది. ప్రపంచవ్యాప్తంగా కూడా దీన్ని అందరూ అభినందించారు.
ఏదేమైనా ప్రస్తుతం మనం మైక్రో కంటైన్మెంట్ జోన్ల మీద దృష్టి సారించాలి. అక్కడే మనం కరోనా వైరస్ను కట్టడి చేయాలి. ఒకటి, రెండు రోజుల పాటు లాక్ డౌన్ విధించడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయనే అంశంపై రాష్ట్రాలు ఓ సమగ్ర అంచనా వేసుకోవాలి. ఆర్థిక వ్యవస్థకు ఎలాంటి సమస్యలు రాకుండా చూసుకోవాలి. రాష్ట్రాలకు ఈ విషయంలో నా సలహా ఏంటంటే, ఈ అంశాన్ని రాష్ట్రాలు సీరియస్గా తీసుకోవాలి. టెస్టిగ్, ట్రీటింగ్, పరిశీలన, సమాచారం చేరవేయడంలో మనం ప్రధానంగా దృష్టి సారించాలి.' అని ప్రధాని మోదీ రాష్ట్రాలకు పిలుపునిచ్చారు.
ప్రధానమంత్రి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఏడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, ఉత్తర్ ప్రదేశ్, తమిళనాడు, ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ సమావేశానికి హాజరయ్యారు. దేశంలోని 63 శాతం కరోనా యాక్టివ్ కేసులు ఈ ఏడు రాష్ట్రాల్లోనే ఉన్నాయి. అలాగే, దేశంలో వస్తున్న కరోనా కేసుల్లో 65 శాతం ఈ ఏడు రాష్ట్రాల్లోనివే. 77 శాతం మరణాలు ఈ ఏడు రాష్ట్రాల్లోనే నమోదవుతున్నాయి.
ఇటీవల కాలంలో కరోనా పేషెంట్లకు ఆక్సిజన్ సరఫరా అందక సమస్యలు ఎదుర్కొంటున్న ఘటనలపై కూడా ప్రధాని మోదీ స్పందించారు. అలాగే, ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి గూడ్స్ సరఫరా నిలిచిపోవడం మీద కూడా స్పందించారు. 'ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి సర్వీసులు, గూడ్స్ నిలిచిపోవడం ఇటీవల సాధారణ ప్రజలకు సమస్యగా మారుతుంది. అది ప్రజల జీవన ప్రమాణాల మీద ప్రభావం చూపుతుంది. చాలా రాష్ట్రాలు ఆక్సిజన్ సరఫరాలో అవాంతరాలు ఎదుర్కొంటున్నాయి. ఆక్సిజన్ సకాలంలో పేషెంట్లకు అందేలా అన్ని చర్యలు తీసుకోవాలి.' అని ప్రధాని మోదీ సూచించారు. అలాగే, రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రతిరోజూ జిల్లాలు, బ్లాక్స్ స్థాయి వరకు వర్చువల్ సమావేశాలు నిర్వహించాలని ప్రధాని మోదీ సూచించారు.
అప్పుడే కరోనా ప్రోటోకాల్స్కు సంబంధించి క్షేత్రస్థాయిలో కూడా సమాచారం తెలుస్తుందన్నారు. 'మనకు 700 జిల్లాలు ఉన్నాయి. అందులో కేవలం 7 రాష్ట్రాల్లోని 60 జిల్లాల్లోనే అత్యధికంగా కరోనా వైరస్ ప్రభావం ఉంది. ముఖ్యమంత్రులు 7 రోజుల ప్రోగ్రాం తీసుకోండి. ప్రతి రోజూ గంట పాటు వర్చువల్ సమావేశాలు నిర్వహించండి. అప్పుడు క్షేత్రస్థాయిలో ఉండే వారి సందేహాలు మొత్తం నివృత్తి అవుతాయి.' అని ప్రధాని మోదీ అన్నారు.