Read also:
ఇంటరు ప్రథమ సంవత్సరం ఆన్లైన్ ప్రవేశాలను ఈనెల 28 నుంచి ప్రారంభించేందుకు విద్యా మండలి కసరత్తు చేస్తోంది. దరఖాస్తులకు సుమారు 10 రోజులపాటు అవకాశం కల్పించనున్నారు. ఈ ఏడాది తొలిసారిగా ఆన్లైన్ విధానంలో నిర్వహిస్తున్నారు. ప్రైవేటు జూనియర్ కళాశాలలకు కొత్త రుసుములను నిర్ణయించలేదు. దాంతో పాత రుసుములనే వసూలు చేయాల్సి ఉంటుంది. ప్రథమ సంవత్సరానికి రూ.3,119, ద్వితీయకు రూ.3,432 మాత్రమే తీసుకోవాలి. ప్రైవేటులోనూ రిజర్వేషన్లు అమలు కానున్నాయి. కరోనా కారణంగా పదో తరగతి విద్యార్థులందర్నీ ఉత్తీర్ణులను చేయడంతో ఇంటర్లో చేరే వారి సంఖ్య పెరగనుంది. దీంతో కొత్త కళాశాలలకు అనుమతులు ఇస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 187 కళాశాలల ఏర్పాటుకు వచ్చిన దరఖాస్తులను విద్యా మండలి పరిశీలిస్తోంది.
దరఖాస్తు ఇలా
- విద్యార్థులు ఎక్కడి నుంచైనా ప్రవేశాల కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
- ఎలాంటి డేటాను సమర్పించాల్సిన అవసరం లేదు.
- వారికి నచ్చిన కళాశాలను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది.
- ఎన్ని కళాశాలలకైనా ఐచ్ఛికాలను ఇచ్చుకోవచ్చు. ఎంపిక చేసుకున్న కళాశాల పరిస్థితులపై 25 ఛాయా చిత్రాలు విద్యార్థులకు కనిపిస్తాయి.
- కళాశాలల్లో మౌలిక సదుపాయాలు, రుసుము, అకడమిక్ వివరాలు అందుబాటులో ఉంటాయి.
- విద్యార్థులకు అవసరమైన స్టడీ మెటీరియల్ను అధికారులు రూపొందిస్తున్నారు.
- దానిని వెబ్సైట్లో అందుబాటులో ఉంచనున్నారు.