Inter regular classes in AP, Minister key remarks on syllabus compression
ఏపీలో 2020-21 విద్యా సంవత్సరం నుంచే 5+3+3+4 విధానాన్ని ప్రారంభిస్తున్నామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ తెలిపారు.ఇంటర్మీడియెట్ తరగతులు ఆలస్యమైనందున ముఖ్యాంశాలను వదలకుండా సీబీఎస్ఈ తరహాలో సిలబస్ను తగ్గిస్తామని మంత్రి సురేశ్ తెలిపారు.9,10,ఇంటర్ విద్యార్థులకు రెగ్యులర్ తరగతులు అక్టోబర్ 5 నుంచి చేపట్టాలని భావిస్తున్నామని అన్నారు. కేంద్రం సూచనల మేరకు తుది నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. ప్రస్తుతం డౌట్లు క్లియర్ చేసుకోవడానికే స్కూల్స్ ప్రారంభమయ్యాయని.9,10, ఇంటర్ విద్యార్ధులు స్కూలుకు వస్తున్నారన్నారు.
అయితే తల్లిదండ్రుల అనుమతితోనే స్కూలుకు రావాలని స్పష్టం చేశారు. అదే విధంగా యాభై శాతం మాత్రమే ఉపాధ్యాయులు స్కూళ్లకు వస్తారని అన్నారు. జగనన్న విద్యా కానుకకు సంబంధించిన అన్ని వస్తువులు ఆయా స్కూళ్లకు చేరాయని వివరించారు. సీఎం ఆదేశాల మేరకు వీటిని నిర్ణీత తేదీన విద్యార్థులకు అందిస్తామని చెప్పారు.
నూతన విద్యావిధానం ప్రకారం 2020–21 విద్యాసంవత్సరం నుంచే 5+3+3+4 విధానాన్ని ప్రారంభిస్తున్నామని అన్నారు. స్కూళ్లకు అనుబంధంగా ఉన్న అంగన్వాడీ కేంద్రాల్లో ముందుగా ఎల్కేజీ, యూకేజీలను ప్రారంభించనున్నామని వెల్లడించారు. టీచర్లకు త్వరలోనే వెబ్ కౌన్సెలింగ్ ద్వారా బదిలీలు ఉంటాయని స్పష్టం చేశారు.