Read also:
సగం మందే ఇ-ఎస్ఆర్ నమోదు తరచూమార్పులతో ప్రక్రియ జాప్యం గడువు పెంచాలంటున్న ఉపాధ్యాయ సంఘాలు
- సగం మందే ఇ-ఎస్ఆర్ నమోదు
- తరచూమార్పులతో ప్రక్రియ జాప్యం
- గడువు పెంచాలంటున్న ఉపాధ్యాయ సంఘాలు
- కైకలూరు (ముదినేపల్లి), న్యూస్టుడే
ఉద్యోగ, ఉపాధ్యాయ జీతభత్యాలు, ఆర్థి.క లావాదేవీలు పారదర్శకంగా, అవినీతికి ఆస్కారం లేకుండా జరగాలనే భావనతో తీసుకువచ్చిన ఉద్యోగుల సేవా పుస్తకం (ఇ-ఎస్ఆర్) నమోదు ప్రక్రియ నత్తనడకనే సాగుతోంది. గత ప్రభుత్వ హయాంలోనే చేపట్టాల్సిన ప్రక్రియ వాయిదా పడింది. కరోనా లాక్డౌన్కు ముందు తుదిరూపునిచ్చి నమోదుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. మొదట్లో ఉద్యోగి ఆస్తి, వ్యక్తిగత వివరాలు సంబంధిత ఆధారాలతో ఆన్లైన్లో పొందుపర్చాలని చెప్పిన ఆర్థిక శాఖ తరవాత వాటిని చాలా వరకు కుదించింది. దీంతో ఇ-ఎస్ఆర్ నమోదు ప్రక్రియ ఇటీవల ఊపందుకుంది. ఇప్పటి వరకు 25 సార్లకు పైగా మార్పులు, చేర్పులు చేశారు. ప్రస్తుతం ఆన్లైన్ 1,2మినహా అన్ని రకాల ఐచ్ఛికాలను పొందుపరిచారని సంఘ నాయకులు తెలుపుతున్నారు.
ఉపాధ్యాయులకు ముగిసిన గడువు?
ఉపాధ్యాయులంతా ఈనెల 25లోపు ఇ-ఎస్ఆర్ నమోదు ప్రక్రియ ఆన్లైన్లో పూర్తిచేయాలని జేడీ (సర్వీసెస్) దేవానందరెడ్డి మౌఖికంగా ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఉపాధ్యాయులకు ఇచ్చిన గడువును మరికొంతకాలం పెంచాలని సంఘాలు కోరుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా వివిధ యాజమాన్యాల్లో పనిచేస్తున్న 14,189 మంది ఉపాధ్యాయులకు 7,215 మంది మాత్రమే ఇప్పటివరకూ ఇ-ఎస్ఆర్ నమోదు ప్రారంభించగా 638 మంది తుది దశను పూర్తి చేశారు. 22 మంది ఉపాధ్యాయుల వివరాలను డీడీవోలు కూడా బయోమెట్రిక్ ద్వారా సబ్మిట్ చేశారు. ఇంకా సగం మంది ఉపాధ్యాయులు నమోదును ప్రారంభించలేదు. మరికొంత కాలం పొడిగించే అవకాశం ఉందని, అన్ని శాఖలు ఈ నెలాఖరులోపు పూర్తి చేయాలని ఆర్థిక శాఖ ఉత్తర్వులు విడుదల చేసిందని సంఘ నాయకులు చెబుతున్నారు. చాలా మంది ఉపాధ్యాయులు లాక్డౌన్ సమయంలో పూర్తి వివరాలు ఆన్లైన్లో సబ్మిట్ చేసినా, తిరిగి మార్పులు, చేర్పుల వల్ల మళ్లీ చేయాల్సి వస్తున్నందున మరో నెల వరకూ గడువు పొడిగించాలని ఉపాధ్యాయులు కోరుతున్నారు.