Read also:
Docter at the doorstep from today
ప్రజల ఆరోగ్యానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నేడు మరో కీలక కార్యక్రమానికి శ్రీకారం చుడుతోంది. రాష్ట్రవ్యాప్తంగా పౌరుల ఆరోగ్య వివరాలను సేకరించి ఇంటి దగ్గరే ఉచితంగా వైద్యం అందించబోతోంది. ఇలాంటి సదుపాయం దేశంలో తొలిసారిగా ఏపీలోనే మొదలవుతోంది. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 20 వేల మంది ఏఎన్ఎంలు నేటి నుంచి 1.48 కోట్ల కుటుంబాల ఇళ్లకు వెళ్లి వారి ఆరోగ్య పరిస్థితులను పరిశీలించి సుమారు 5.34 కోట్ల మంది ప్రజల వివరాలను నమోదు చేస్తారు. ప్రమాదకరంగా పరిగణించే ఏడు రకాల జబ్బులను గుర్తిస్తారు. వైద్య సదుపాయం అందిస్తారు. ఇదే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యం. ఇందుకోసం ప్రత్యేకంగా రూపొందించిన యాప్ ద్వారా డేటాను నమోదుచేస్తారు.
వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే ఆరోగ్య రంగాన్ని సంస్కరించి ప్రజల ఆరోగ్య వివరాలన్నీ క్యూఆర్ కోడ్తో కూడిన ఆరోగ్యశ్రీ కార్డులో పొందుపరచాలని నిర్ణయించారు. అదే జరుగుతోంది.
ఈ కార్యక్రమాన్ని నెలల తరబడి కొనసాగించరు. ఒక్కో ఏఎన్ఎంకు 500 నుంచి 800 ఇళ్లు అప్పగించారు. రోజుకు 25 నుంచి 30 ఇళ్లలో స్క్రీనింగ్ ఉంటుంది. నెల రోజుల్లో కార్యక్రమం పూర్తవుతుంది. ఏఎన్ఎంలకు 40వేల మంది ఆశా కార్యకర్తలు సాయం చేస్తారు. స్క్రీనింగ్ ద్వారా సేకరించే ఆరోగ్య వివరాలు NCD అండ్ AMB యాప్లో నమోదవుతాయి. అక్కడ నుంచి సెంట్రల్ పోర్టల్కు చేరతాయి.
స్క్రీనింగ్ పరీక్షల కోసం ప్రజలను నాలుగు విభాగాలుగా విభజించారు.
(1) ఆరేళ్ల లోపు చిన్నారులు,
(2) 6 - 20 ఏళ్ల లోపువారు,
(3) 20 - 60 ఏళ్ల వయసు లోపు వారు,
(4) 60 ఏళ్లు దాటిన వారు
ఆరోగ్య వివరాల సేకరణకు 9 నుంచి 53 ప్రశ్నలు రూపొందించారు.
రెండో దశలో ట్రీట్మెంట్:
ముందుగా 5.34 కోట్ల ప్రజల ఆరోగ్యాన్ని స్క్రీనింగ్చేసి ఎవరికి ఎలాంటి జబ్బులు, లక్షణాలున్నాయో గుర్తిస్తారు. ఎలాంటి చికిత్స అవసరమో సూచిస్తారు. పెద్ద జబ్బులైతే నేరుగా ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రులకు పంపిస్తారు. ఏఎన్ఎంలు సేకరించే హెల్త్ డేటాను ఆరోగ్యశ్రీ కార్డుల్లో నిక్షిప్తం చేసి పౌరుల ఆరోగ్య వివరాలను భద్రపరుస్తారు. సత్వరమే మెరుగైన వైద్యం అందేలా ఇది పనిచేస్తుంది.
ఈ జబ్బులపై ప్రధాన దృష్టి:
ఏఎన్ఎంలు ఇంటింటికీ వెళ్లి ప్రధానంగా 7 రకాల జబ్బులను గుర్తించి పరీక్షలు జరిపి వైద్య సాయం అందేలా చర్యలు తీసుకుంటారు. మధుమేహం, హైపర్ టెన్షన్, లెప్రసీ (కుష్టువ్యాధి) లక్షణాలు, క్షయ ప్రాథమిక లక్షణాలు, నోరు, సర్వైకల్, రొమ్ము క్యాన్సర్లు, చిన్నారులు, మహిళల్లో రక్తహీనత, చిన్నారుల్లో వినికిడి లోపం, ఇతరత్రా పుట్టుకతో వచ్చే జబ్బులను గుర్తించి చికిత్స అందిస్తారు.
"చాలామందికి తమకు జబ్బులు ఉన్నట్లు కూడా తెలియదు. అలాంటి వారి కోసం ఇంటి దగ్గరకే వెళ్లి పరీక్షలు జరిపి వైద్యం అందించే కార్యక్రమం దేశంలో మొదటిసారి ఏపీలోనే మొదలవుతోంది. ఇది సామాన్యులకు వైద్యాన్ని మరింత చేరువ చేస్తుంది' అని వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ డాక్టర్ కె.ఎస్.జవహర్రెడ్డి తెలిపారు.