కరోనా నేపథ్యంలో క్వారంటైన్లో ఉండి ఎంసెట్ రాయలేకపోయిన ఏపీ విద్యార్థులకు సర్కార్ శుభవార్త చెప్పింది. వారికి మరోసారి పరీక్ష నిర్వహించనున్నట్లు ఏపీ ఎంసెట్ చైర్మన్, కాకినాడ జేఎన్టీయూ ఉపకులపతి ప్రొఫెసర్ ఎం.రామలింగరాజు సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఇందుకు ప్రభుత్వం అనుమతిచ్చిందని తెలిపారు. ఇప్పటికే దాదాపు 20 మంది విద్యార్థులు తాము పరీక్ష రాయలేకపోయామని, మరోసారి అవకాశం కల్పించాలని కోరినట్లు చెప్పారు. అలాంటి వారు ఏపీ ఎంసెట్ హెల్ప్లైన్ సెంటర్ మెయిల్ ఐడీ 'helpdeskeamcet2020@gmail.com' ద్వారా దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.
అదే విధంగా ఎంసెట్ హాల్ టికెట్, కోవిడ్ పాజిటివ్ రిపోర్టులను ఈ నెల 30వ తేదీ సాయంత్రం 5 గంటల్లోగా పంపించాలని సూచించారు.
వీరికి ఆన్లైన్లో పరీక్ష నిర్వహించే తేదీని ఎంసెట్ వెబ్సైట్ ద్వారా తెలియ చేస్తామని ఎంసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ వీ.రవీంద్ర తెలిపారు. వివరాలకు 0884-2340535, 2356255 నంబర్ ను సంప్రదించాలని ప్రొఫెసర్ ఎం.రామలింగరాజు సూచించారు.ఏపీలో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మా తదితర కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఎంసెట్ పరీక్ష శుక్రవారంతో ప్రశాంతంగా ముగిసింది. ఈ పరీక్షలను ఆన్లైన్ లో హైదరాబాద్తో పాటు ఏపీలోని మొత్తం 47 నగరాల్లోని 118 కేంద్రాల్లో నిర్వహించారు. ఈనెల 17వ తేదీ నుంచి 25 వరకు ఉదయం, మధ్యాహ్నం మొత్తం 14 సెషన్లలో పరీక్షలు జరిగాయి. 9 సెషన్లలో జరిగిన ఇంజనీరింగ్ విభాగానికి 1,85,946 మంది దరఖాస్తు చేసుకున్నారు. వారిలో 1,56,899 మంది (84.38 శాతం) పరీక్ష రాశారు. 23వ తేదీ నుంచి 25 వరకు అగ్రి, మెడికల్ విభాగం పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షలకు మొత్తం 87,652 మంది దరఖాస్తు చేసుకోగా 75,834 (86.52%) మంది హాజరయ్యారు.
అయితే కరోనా బారిన పడి హోం ఐసోలేషన్ ఉన్న, ఆస్పత్రుల్లో ఉన్న విద్యార్థులు పరీక్షలు రాయలేకపోయారు. తమకు పరీక్ష రాయడానికి అవకాశం ఇవ్వాలని ప్రభుత్వానికి, అధికారులకు వినతి పత్రాలు అందాయి. ఈ అంశంపై సానుకూలంగా స్పందించిన ప్రభుత్వం ఐసోలేషన్ లో ఉండి ఎంసెట్ రాయలేకపోయిన విద్యార్థులకు మరో సారి పరీక్ష రాసే అవకాశం కల్పించింది. దీంతో ఆయా విద్యార్థులు, తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.