Read also:
AP Cabinet Meeting Date and these are the topics to be discussed
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం అక్టోబర్ 1న జరగనుంది.అమరావతిలో ఈ సమావేశం జరగనుంది. ఈ కేబినెట్లో పలు అంశాలపై చర్చించనున్నారు.
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం అక్టోబర్ 1న జరగనుంది. అమరావతిలో ఈ సమావేశం జరగనుంది. ఈ కేబినెట్లో పలు అంశాలపై చర్చించనున్నారు. రాష్ట్రంలో గత కొన్ని రోజుల నుంచి హిందూ ఆలయాల మీద దాడులు జరుగుతున్నాయి. ముఖ్యంగా అంతర్వేది రథం దగ్ధం ఘటనపై రాష్ట్రవ్యాప్తంగా పెను దుమారం రేగింది. ఈ ఘటనపై ఏపీ ప్రభుత్వం సీబీఐ విచారణకు ఆదేశించింది. దీనికి సంబంధించి కేబినెట్లో చర్చించే అవకాశం ఉంది. అలాగే, ఇటీవల సీఎం వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో రెండు సార్లు చర్చించారు. వారిద్దరి మధ్య భేటీకి సంబంధించిన అంశాలు కేబినెట్ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ (కంటైన్మెంట్ జోన్లలో) సెప్టెంబర్ 30తో ముగుస్తుంది. దీంతో కేంద్రం కొత్త లాక్ డౌన్ నిబంధనలను త్వరలో విడుదల చేయనుంది. వాస్తవానికి అక్టోబర్ 5 నుంచి ఏపీలో స్కూళ్లు తెరవాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. మొదట సెప్టెంబర్ 5 నుంచి తెరవాలని భావించినా, కేంద్రం నిబంధనల కారణంగా ఏపీలో స్కూళ్లు తెరవడం వాయిదా పడింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నవరత్నాల పథకాల్లో భాగంగా విద్యార్థుల తల్లిదండ్రుల ఖాతాల్లో డబ్బులు కూడా స్కూళ్లు తెరిచే సమయంలోనే వేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ క్రమంలో స్కూళ్లు తెరిచే అంశం మీద కూడా కేబినెట్లో చర్చించనున్నారు.
అమరావతి భూముల కుంభకోణం దర్యాప్తు వ్యవహారంలో ఏపీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాల తరువాత.. ఎలాంటి ముందడుగు వేయాలనేది ప్రభుత్వం తేల్చుకోలేకపోతోంది. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో చోటు చేసుకున్నట్లుగా అనుమానిస్తోన్న భూముల కుంభకోణం విషయంపై జగన్ సర్కార్ ప్రత్యేక దర్యాప్తు బృందంతో విచారణ చేపట్టింది. దీన్ని నిలిపివేయాలని కోరుతూ తెలుగుదేశం పార్టీ సీనియర్ నేతలు ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. సిట్ దర్యాప్తు కొనసాగించడంపై హైకోర్టు స్టే విధించింది. ఇక దీనిపై ఎలా ముందుకెళ్లాలనే విషయంపై మంత్రివర్గం చర్చించవచ్చని తెలుస్తోంది.
అమరావతి భూముల కుంభకోణంపై సిట్కు బదులుగా సీబీఐతో దర్యాప్తు చేయించాలనే అంశంపై మంత్రివర్గం చర్చించవచ్చని సమాచారం. కేంద్రం పరిధిలో ఉన్న దర్యాప్తు సంస్థ కావడం వల్ల సీబీఐకి ఈ కుంభకోణంపై సమగ్ర విచారణ చేపట్టినట్టవుతుందని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. మంత్రివర్గ సమావేశంలో చర్చించిన తరువాతే.. ప్రభుత్వం దీనిపై ఓ నిర్ణయానికి వస్తుందని చెబుతున్నారు. అమరావతి భూముల కుంభకోణంలో వెనక్కి తగ్గకూడదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విశ్వసిస్తున్నారని తెలుస్తోంది. ఇటీవల ఢిల్లీకి వెళ్లిన సమయంలో జగన్ కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ఈ అంశంపై కూడా చర్చించారనే అభిప్రాయం కూడా రాజకీయవర్గాల్లో నెలకొంది.
సెప్టెంబర్ 3న జరిగిన ఏపీ కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలను తీసుకుంది ఏపీ ప్రభుత్వం. ఉచిత విద్యుత్ పథకం నగదు బదిలీకి ఏపీ రాష్ట్ర మంత్రివర్గ ఆమోదం తెలిపింది. రైతులకు అందే విద్యుత్తు ఎప్పటికీ ఉచితమే అని సీఎం జగన్ స్పష్టం చేశారు. ఒక్క కనెక్షన్కూడా తొలగించబోమని, ఉన్న కనెక్షన్లను రెగ్యులరైజ్ చేస్తామని తెలిపారు. కనెక్షన్ ఉన్న రైతు పేరు మీద ప్రత్యేక ఖాతా తెరుస్తామని.. ఆ ఖాతాలో ప్రభుత్వం డబ్బులు వేస్తుందని తెలిపారు. ఆ డబ్బును రైతులు డిస్కంలకు చెల్లించాల్సి ఉంటుందని అన్నారు. దీనికి పూర్తి బాధ్యత ప్రభుత్వానిదే అని తెలిపారు. మీటర్ల ఖర్చు డిస్కంలు, ప్రభుత్వానిదే అని సీఎం జగన్ వ్యాఖ్యానించారు.