Read also:
దేశ ప్రధాని నరేంద్ర మోదీ అవలంబిస్తున్న ఆర్థిక విధానాలకు నిరసనగా బ్యాంకు యూనియన్లు సమ్మెబాట పట్టనున్నాయి. వచ్చే వారం దేశవ్యాప్తంగా సమ్మె చేస్తున్నట్టు సెంట్రల్ ట్రేడ్ యూనియన్స్ పిలుపునిచ్చాయి. జనవరి 8 న బ్యాంకు ఉద్యోగులు ఎవ్వరూ విధుల్లో చేరొద్దని ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయిస్ అసోషియేషన్ (ఏఐబీఈఏ), బ్యాంక్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(బీఈఎఫ్ఐ) ప్రకటించాయి.
బ్యాంక్ సమ్మె ప్రభావంతో జనవరి 8న దేశవ్యాప్తంగా బ్యాంకులు మూతపడటంతో పాటుగా ఏటీఎం సర్వీసులు కూడా నిలిచిపోయే అవకాశం ఉంది. కాకపోతే ఆన్ లైన్ బ్యాంకింగ్ సర్వీసులు యథావిథిగా పనిచేయనున్నాయి. బ్యాంకు సమ్మె రోజున బ్యాంకు విధులేవీ నిర్వర్తించకూడదని ఆల్ ఇండియా బ్యాంకు ఆఫీసర్స్ కాన్ఫడరేషన్(ఏఐబీవోసీ) జనరల్ సెక్రటరీ సౌమ్య దత్త తెలిపారు. అలాగే బ్యాంకుల విలీనం, బ్యాంకుల సంస్కరణలకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేయడంతో పాటు బ్యాంకు ఉద్యోగుల జీతభత్యాలపెంపుపై కూడా బ్యాంకు యూనియన్లు సమ్మె చేయనున్నాయి. బ్యాంకు ఉద్యోగుల వేతనాల పెంపు విషయం చాలా రోజుల నుంచి పెండింగ్ లోనే ఉంది.ఏప్రిల్ 2010 తర్వాత విధుల్లో చేరిన ఉద్యోగులు పెన్షన్ బెనిఫిట్ కు దూరం అయ్యారు. వారానికి 5 రోజుల పనిదినాల డిమాండ్ పై ప్రభుత్వం ఇప్పటి వరకు నోరెత్తలేదు. బ్యాంకు ఉద్యోగులు, ఉన్నతాధికారులు... తీవ్ర పని ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. సరిపోయేంత స్టాఫ్ ను నియమించడం లేదు.. అంటూ పలు డిమాండ్లను బ్యాంకు యూనియన్లు సమ్మె ద్వారా లేవనెత్తనున్నట్టు సమ్మె నోటీసు ద్వారా తెలుస్తోంది. బ్యాంక్ సమ్మెకు ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ అసోషియేషన్(ఏఐబీవోఏ), ఇండియన్ నేషనల్ బ్యాంక్ ఎంప్లాయిస్ఫె డరేషన్(ఐఎన్బీఈఎఫ్), ఇండియన్ నేషనల్ బ్యాంక్ ఆఫీసర్స్ కాంగ్రెస్(ఐఎన్బీవోసీ) మద్దతు ఇస్తున్నట్టు ప్రకటించాయి.