Read also:
ఈ రోజుల్లో ప్రతీ ఇంట్లో రెండు మూడు మొబైళ్లు కామన్. మరి అన్ని మొబైళ్లకూ ఒకే లాంటి ఛార్జర్ ఉంటే సరిపోతుంది కదా అని మీకు అనిపించవచ్చు. అలాంటి ప్రయత్నం ఇప్పుడు మొబైల్ కంపెనీలు చేస్తున్నాయి.
మన దగ్గర రెండు మొబైళ్లు ఉంటే... రెండిటికీ ఒకటే ఛార్జర్ ఉంటే... మరో ఛార్జర్ అవసరం ఉండదు. ఇదే విధంగా ప్రపంచం మొత్తం వెయ్యి కోట్లకు పైగా మొబైళ్లు ఉంటే... వాటికి ఛార్జర్లు కూడా వెయ్యి కోట్లు అవసరం అవుతుంటే... ఎంత ప్లాస్టిక్, ఈ-వేస్ట్ అవుతుందో కదా. అదే ప్రపంచంలోని అన్ని మొబైళ్లకూ ఛార్జింగ్ పోర్ట్ డిజైన్ ఒకేలా ఉంటే... అప్పుడు ఇన్ని రకాల చార్జర్ల అవసరమే ఉండదు. తద్వారా కొన్ని కోట్ల ఛార్జర్ల తయారీని ఆపొచ్చు. ఈ-వేస్ట్ కూడా తగ్గించవచ్చు. అని యూరోపియన్ రాజకీయ నేతలు ఆలోచించారు. తమ ప్రతిపాదనను మొబైల్ హ్యాండ్ సెట్ తయారీ కంపెనీలకు తెలిపారు. ఇకపై కొత్తగా తయారుచేయబోయే మొబైల్ ఫోన్లు, టాబ్లెట్లు, ఈ బుక్ రీడర్లూ, ఇతర పోర్టబుల్ పరికరాలన్నింటికీ ఛార్జింగ్ పోర్ట్ ఒకేలా ఉండాలని కోరారు. నిజానికి ఇది 2014లోనే వచ్చిన ఆలోచన. ఇప్పటికి ఆచరణలోకి వచ్చేలా ఉంది. దీనిపై జనవరి 13న చర్చ జరిగింది. వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో దీనిపై ఓటింగ్ జరుగుతుంది. అదే జరిగితే... కచ్చితంగా రాజకీయ నాయకుల అభిప్రాయాన్ని అందరూ స్వాగతించే అవకాశం ఉంటుంది.
ప్రస్తుతం చార్జింగ్కి సంబంధించి... యాపిల్ లైటింగ్, USB 2.0 మైక్రో B, USB టైప్ C తరహా ఛార్జింగ్ పోర్టులు ఉన్నాయి. బయట దొరికే ఛార్జర్లన్నీ ఈ మూడు పోర్టులకూ సెట్ అయ్యేవే. యాపిల్ కంపెనీ విషయానికొస్తే... ఆ కంపెనీ ప్రపంచవ్యాప్తంగా 100 కోట్లకు పైగా పరికరాలకు యాపిల్ లైటింగ్ పోర్టును సెట్ చేసింది. కొత్త రూల్ అమల్లోకి వస్తే... ఇకపై యాపిల్ కూడా మిగతా కంపెనీలు, యూరోపియన్ యూనియనూ... ఎలాంటి పోర్టును ఎంపిక చేస్తాయో... దాన్ని ఆమోదించాల్సి ఉంటుంది. కొత్తగా తెలిసిందేంటంటే... యాపిల్ తన కొత్త మొబైల్ ఐఫోన్ 12 సిరీస్కి లైటింగ్ చార్జర్ కాకుండా... టైప్ C USB పోర్ట్ తేబోతుంది. 2021లో రానున్న ఐఫోన్లకైతే... అసలు ఛార్జింగ్ పోర్టే ఉండదట. పూర్తిగా వైర్లెస్ ఛార్జింగ్ తెస్తారట.