Read also:
జనగణనలో మొబైల్ నంబర్
జనగణన సమయంలో కుటుంబ పెద్ద మొబైల్ నెంబర్ వివరాలను కూడా సమాచారం కోసం వచ్చిన ఉద్యోగులకు(ఎన్యూమరేటర్లు) ఇవ్వాల్సి ఉంటుంది. మొత్తం 31 ప్రశ్నలకు సంబంధించి సమాచారాన్ని సేకరించాల్సిందిగా జనగణన అధికారులను ఆదేశించామని రిజిస్ట్రార్ జనరల్ అండ్ సెన్సస్ కమిషనర్ ఒక ప్రకటనలో తెలిపారు. అయితే, మొబైల్ నెంబర్ను జనగణనకు సంబంధించిన సమాచారం ఇవ్వడానికి మాత్రమే వినియోగిస్తామని, మరే ఇతర అవసరాలకు వాడబోమని ఆ ప్రకటనలో స్పష్టం చేశారు.
ఇతర ప్రశ్నలతో పాటు కుటుంబపెద్ద ఫోన్ నెంబర్, ఇంట్లో ఉన్న టాయిలెట్లు, టీవీ, ఇంటర్నెట్, స్మార్ట్ ఫోన్స్, సొంత వాహనాలు, కంప్యూటర్, ల్యాప్టాప్, తాగు నీటి వసతి.. తదితర సమాచారాన్ని ఎన్యూమరేటర్లు సేకరిస్తారు. ఏప్రిల్ 1–సెప్టెంబర్ 30 మధ్యలో కుటుంబ సమాచార సేకరణ ప్రక్రియ కొనసాగుతుంది. కుటుంబ పెద్ద ఎస్సీ లేదా ఎస్టీ లేదా ఇతర ఏ సామాజిక వర్గానికి చెందుతారనే వివరాలూ సేకరిస్తారు. ఇల్లు సొంతమా?, ఇంట్లోని గదులెన్ని? ముఖ్యమైన ఆహారం ఏమిటి?, వంటకు వాడే ఇంధనం ఏమిటి? తదితర ప్రశ్నలు కూడా ఉంటాయి. ఈ సారి పేపర్పై కాకుండా ఈ వివరాలన్నింటినీ మొబైల్ యాప్లో నిక్షిప్తం చేస్తారు. జనగణనతో పాటు జాతీయ జనాభా పట్టిక(ఎన్పీఆర్)ను కూడా రూపొందించాలని కేంద్రం నిర్ణయించింది.
జాతీయ పౌరసత్వ పట్టిక(NRC),పౌరసత్వ సవరణ చట్టం(CAA)లకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్న వేళ.. కేంద్ర ప్రభుత్వం జాతీయ జనాభా పట్టిక(NPR) రూపకల్పనకు సిద్దమైన సంగతి తెలిసిందే. ఎన్ఆర్సీ,సీఏఏలకు ఎన్పీఆర్ అనేది దొడ్డిదారి అని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. అయితే కేంద్ర ప్రభుత్వం మాత్రం ఆ విమర్శలను పట్టించుకోవడం లేదు. పౌరసత్వ గుర్తింపు కార్డులు ఇవ్వడమే ఎన్పీఆర్ లక్ష్యమని ప్రభుత్వం చెబుతోంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తాజాగా జనాభా లెక్కలకు సంబంధించి ఓ ప్రకటన విడుదల చేసింది.
ఆ వివరాలు కూడా జనాభా
లెక్కల కోసం సేకరించే అంశాల్లో ఇంట్లో ధాన్యం వినియోగానికి సంబంధించిన వివరాలను కూడా సేకరించనున్నట్టు కేంద్ర ప్రభుత్వం గురువారం తెలియజేసింది. వీటితో పాటు గృహ వినియోగానికి సంబంధించిన పలు వివరాలు కూడా సేకరించనున్నట్టు తెలిపింది.
అలాంటి వివరాలు సేకరించడం మొదటిసారి జనాభా లెక్కల సేకరణ-2021లో సేకరించే వివరాల్లో భాగంగా స్మార్ట్ ఫోన్,గ్యాస్ పైప్ లైన్ కనెక్షన్స్,మొబైల్ నంబర్ వంటి వివరాలను కూడా సేకరించనున్నారు. జనాభా లెక్కల్లో ఈ రకమైన వివరాలను సేకరించడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. జనాభా లెక్కలకు సంబంధించిన కమ్యూనికేషన్ వివరాల కోసం మాత్రమే సెల్ ఫోన్ నంబర్ అడుగుతున్నట్టు ప్రభుత్వం చెబుతోంది. ఈసారి జనాభా లెక్కల వివరాల్లో బ్యాంకింగ్కి సంబంధించిన ప్రశ్నలను కూడా తొలగించడం గమనార్హం.
మొత్తం 31 వివరాలు జనాభా లెక్కల సేకరణ,ఎన్పీఆర్కి సంబంధించి హోం మంత్రిత్వ శాఖ రిజిస్ట్రార్ జనరల్ గురువారం నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ నోటిఫికేషన్ ప్రకారం జనాభా లెక్కల కోసం మొత్తం 31 అంశాలకు సంబంధించిన వివరాలను పౌరుల నుంచి సేకరించనున్నారు. గతంలో జరిగిన జనాభా లెక్కల సేకరణలో 30 ప్రశ్నలు మాత్రమే అడగ్గా.. అందులో ధాన్య వినియోగానికి సంబంధించిన ప్రశ్న లేదు. ఇక ఎన్పీఆర్ అప్డేట్ కోసం 21 అంశాలకు సంబంధించిన వివరాలను సేకరించనున్నానరు.
ఏప్రిల్-సెప్టెంబర్ మధ్య
ఈ ఏడాది ఏప్రిల్-సెప్టెంబర్ మధ్య కాలంలో జనాభా లెక్కలను సేకరించనున్నారు. అదే సమయంలో ఎన్పీఆర్ కూడా అప్డేట్ చేయనున్నారు. దేశంలో అసలు ఎంత మంది నివసిస్తున్నారన్న లెక్క తేల్చడమే ఎన్పీఆర్ ఉద్దేశం. ఏదైనా ఒక ప్రాంతంలో ఆర్నెళ్ల నుంచి నివసిస్తున్నవారిని,లేదా రాబోయే ఆర్నెళ్లు లేదా అంతకంటే ఎక్కువ కాలం ఏదైనా ప్రాంతంలో ఉండాలని నిర్ణయించుకున్నవారిని స్థానిక పౌరులుగా గుర్తించి ఇంటి ఇంటికి ఆ వివరాలను నమోదు చేస్తారు. మన దేశంలో గత 6 నెలలుగా నివసిస్తున్న విదేశీయుల వివరాలను కూడా ఇందులో నమోదు చేస్తారు.