Read also:
రాజధాని అమరావతిపై బీసీజీ (బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్) తుది నివేదికను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డికి అందజేసింది. శుక్రవారం మధ్యాహ్నం సీఎం క్యాంప్ ఆఫీసులో జగన్ను కలిసిన బీసీజీ ప్రతినిధులు నివేదికను అందజేశారు. రాజధాని, అభివృద్ధిపై సీఎంకు బీసీజీ ప్రతినిధుల నివేదిక అందించారు. కాగా.. రాజధానిపై ఇప్పటికే జీఎన్ రావు కమిటీ నివేదిక ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈనెల 6న రెండు నివేదికలనూ హైపవర్ కమిటీ పరిశీలించనుంది. అనంతరం 8న రెండు నివేదికలపై కేబినెట్ చర్చించనున్నది. హైపవర్ కమిటీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి సారథ్యాన ఈ నెల 6వ తేదీన తొలిసారిగా సమావేశం కానుంది. ఈ కమిటీ 3 వారాల్లో తన తన సిఫారసులను ప్రభుత్వానికి అందజేయాల్సి ఉంది.
సంక్రాంతి తర్వాత హైపవర్ కమిటీ తన నివేదికను సీఎంకు సమర్పించనుందని సమాచారం. అనంతరం దానిపై కేబినెట్లో చర్చించి.. శాసనసభ సమావేశం ఏర్పాటుచేసి.. అక్కడ ఆమోదింపజేసుకుంటారని అంటున్నారు. ఇంకోవైపు.. 8వ తేదీన రాష్ట్ర కేబినెట్ సమావేశం జరుగనుంది.
కాగా.. గత ప్రభుత్వం అనుకున్నట్లుగా ప్రపంచస్థాయి రాజధాని నగరంగా అమరావతిని నిర్మించడం ఏమేరకు సాధ్యమో పరిశీలించి, నివేదిక ఇవ్వాలని అమెరికాకు చెందిన ఈ కన్సల్టెన్సీ సంస్థను రాష్ట్రప్రభుత్వం కోరడం, ఇప్పటికే అది మధ్యంతర నివేదికను సమర్పించడం తెలిసిందే.