Read also:
జమ్మూకశ్మీర్ నుంచి 72 కేంద్ర పారామిలటరీ దళాల ఉపసంహరణ
న్యూఢిల్లీ : కేంద్రపాలిత ప్రాంతమైన జమ్మూకశ్మీర్ విషయంలో కేంద్ర హోం మంత్రిత్వశాఖ తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది.జమ్మూకశ్మీర్లో మోహరించిన 72 కేంద్ర పారామిలటరీ దళాలను ఉపసంహరించాలని కేంద్ర హోంమంత్రిత్వశాఖ నిర్ణయించింది. జమ్మూకశ్మీర్ నుంచి విత్ డ్రా చేసిన కేంద్ర పారామిలటరీ దళాల్లో 24 సీఆర్ఫీఎఫ్ కంపెనీలు, 12 కంపెనీల బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్, 12 కంపెనీల ఇండో టిబెటన్ బార్డర్ పోలీసు దళం, 12 కంపెనీల సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్, మరో 12 కంపెనీల సషస్త్ర సీమాబల్ దళాలున్నాయి.
ఆర్టికల్ 370 రద్దు అనంతరం కేంద్రపాలిత ప్రాంతమైన జమ్మూకశ్మీర్లో శాంతియుత పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో 72 కంపెనీల కేంద్ర పారామిలటరీ దళాలను లోయలో నుంచి ఉపసంహరించాలని కేంద్ర హోంమంత్రిత్వశాఖ ఉన్నతస్థాయి సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.
జమ్మూకశ్మీర్లో ఆర్టికల్ 370ని రద్దు చేసినపుడు ఈ ఏడాది ఆగస్టు నెలలో అదనపు కేంద్ర బలగాలను మోహరించారు. కేంద్ర హోంమంత్రిత్వశాఖ ఉన్నత స్థాయి సమావేశంలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోభాల్, కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ కుమార్ భల్లా, ప్రత్యేక సలహాదారు కె విజయకుమార్, ఆర్మీచీఫ్ జనరల్ బిపిన్ రావత్, ఇంటలిజెన్స్ బ్యూరో చీఫ్ అర్వింద్ కుమార్, జమ్మూకశ్మీర్ డీజీపీ దిల్ బాగ్ సింగ్, సీఆర్ఫీఎఫ్ డైరెక్టరు జనరల్ ఆర్ఆర్ భట్నాగర్, బీఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్ వీకే జోహ్రీలు పాల్గొన్నారు.