Read also:
ఈ డెబిట్కార్డులను బ్లాక్ చేయనున్న ఎస్బీఐ
దిల్లీ: మ్యాగ్స్ట్రైప్తో ఉన్న డెబిట్ కార్డులను డిసెంబర్ 31 తర్వాత ఎస్బీఐ బ్లాక్ చేయనుంది. వాటి స్థానంలో కొత్త ఈఎంవీ చిప్ అండ్ పిన్ బేస్డ్ డెబిట్ కార్డులను తీసుకోవాలని సూచించింది. ఈ నెల 31లోపు మ్యాగ్స్ట్రైప్కార్డులను ఎలాంటి రుసుము లేకుండా మార్చుకునే వెసులుబాటు కల్పించింది. ప్రస్తుతం మ్యాగ్స్ట్రైప్ కార్డు ఉన్న ఖాతాదారులు కొత్త తరహా కార్డుల కోసం తమ హోంబ్రాంచిలో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఈ మేరకు ట్విటర్ ద్వారా ఎస్బీఐ తమ ఖాతాదారులకు సమాచారం తెలియజేసింది.
మోసపూరిత లావాదేవీల నుంచి వినియోగదారులను రక్షించేందుకు 'రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా' కొత్త మార్గదర్శకాలు జారీ చేసిన విషయం తెలిసిందే.
వీటిలో భాగంగా మ్యాగ్స్ట్రైప్ డెబిట్ కార్డులు ఉన్న ఖాతాదారులు వాటి స్థానంలో ఈఎంవీ చిప్ డెబిట్ కార్డులు తీసుకోవాలని ఆర్బీఐ సూచించింది. ఆయా బ్యాంకులు ఈ సేవలను పూర్తిగా అందించాలని, ఈ ఏడాది చివరిలోగా ప్రతి ఒక్కరూ చిప్ ఆధారిత కార్డులు తీసుకోవాలని ఆర్బీఐ స్పష్టం చేసింది.
ఈ చిప్ ఆధారిత కార్డులను ఆర్బీఐ 2016 నుంచే తప్పనిసరి చేసింది. 2016 జనవరి 31 తర్వాత బ్యాంకు ఖాతాలు తెరిచిన కొత్త కస్టమర్లు, క్రెడిట్ లేదా డెబిట్ కార్డులను దరఖాస్తు చేసుకున్న వారిని చిప్ ఆధారిత కార్డులే జారీ చేయాలని పేర్కొంది. అయితే, అంతకుముందు నుంచి ఉన్న కార్డులను కూడా తప్పనిసరిగా మార్చాలని ఆర్బీఐ మార్గదర్శకాలు జారీ చేసింది. దీంతో ఈ విషయంపై ఇప్పటికే తమ కస్టమర్లకు ఎస్బీఐ సమాచారం అందజేసింది.