Read also:
ఆంగ్ల మాధ్యమ సవాళ్లను అధిగమిస్తాం: జగన్
ప్రపంచానికి గొప్ప మేధావులను అందించిన చరిత్ర ఆంధ్ర విశ్వవిద్యాలయానికి ఉందని సీఎం జగన్మోహన్రెడ్డి అన్నారు. ప్రఖ్యాత పారిశ్రామికవేత్త గ్రంథి మల్లికార్జునరావు (జీఎంఆర్) ఇక్కడి నుంచే వచ్చారని ఈ సందర్భంగా సీఎం గుర్తు చేశారు. విశాఖలోని ఆంధ్రవిశ్వవిద్యాలయం (ఏయూ)లో నిర్వహించిన పూర్వ విద్యార్థుల సమావేశానికి జగన్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. దేశంలో ఏయూ 14వ స్థానంలో ఉందని.తొలి ఐదు స్థానాల్లో ఉండాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. ఏయూలో 459 బోధనా సిబ్బంది పోస్టులు ఖాళీగా ఉన్నాయని.వాటిని భర్తీ చేయాల్సిన అవసరముందన్నారు. చదువుల దీపం కుటుంబానికి వెలుగు ఇస్తుందని తాను బలంగా నమ్ముతానని చెప్పారు. ఏదైనా బలంగా అనుకుంటేనే దాన్ని సాధించగలమన్నారు. విద్యారంగంలోనూ విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నామని సీఎం వివరించారు.
పాఠశాలల్లో మౌలిక వసతులు లేని దుస్థితి నెలకొందని.‘నాడు-నేడు’ ద్వారా ప్రతి పాఠశాలలో 9 రకాల వసతులపై దృష్టిపెట్టామని జగన్ అన్నారు. ఆంగ్లమాధ్యమం అమలు చేయడంలో బోధనా సమస్యలు కచ్చితంగా ఉంటాయని.వాటిని అధిగమించి లక్ష్యం చేరుకుంటామని చెప్పారు. అక్కడితో ఆగకుండా ఉన్నత విద్యపైనా దృష్టి సారిస్తామన్నారు. డిగ్రీ కోర్సును నాలుగేళ్లు చేయాలన్న ఆలోచన ఉందని.ఒక ఏడాది పూర్తిగా ప్రాక్టికల్స్, ఉద్యోగ సన్నద్ధతపై దృష్టి పెట్టేలా చర్యలు చేపడతామని చెప్పారు. బీటెక్లో ఆనర్స్ ప్రవేశపెట్టి కోర్సును ఐదేళ్లు చేస్తామన్నారు. బీటెక్లోనూ చివరి ఏడాది ప్రాక్టికల్స్, ఉద్యోగ సన్నద్ధతపై దృష్టి పెడతామని చెప్పారు. బోధనాఫీజుల చెల్లింపు వందశాతం జరిగేలా కసరత్తు చేస్తున్నామని సీఎం స్పష్టం చేశారు. విద్యాదీవెన పథకం కింద ఏటా రూ.20వేలు అందిస్తామన్నారు. పూర్వ విద్యార్థుల అభ్యర్థన మేరకు ఏయూ అభివృద్ధికి రూ.50కోట్లు మంజూరు చేస్తున్నట్లు జగన్ ప్రకటించారు. అంతకుముందు జీఎంఆర్ హాస్టల్, లవ్ అండ్ కేర్ రీడింగ్రూమ్కు సీఎం శంకుస్థాపన చేశారు.
కృత్రిమ మేధపై ఏయూతో కలిసి పనిచేస్తాం: టెక్ మహీంద్ర సీఈవో
ఏయూలో ఒకరోజు ఉండటం ఎంతో స్ఫూర్తిని ఇచ్చిందని టెక్ మహీంద్ర సీఈవో గుర్నాని అన్నారు. టెక్ మహీంద్ర క్యాంపస్కు దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్రెడ్డి శంకుస్థాపన చేశారని.ఆయన కల ఏవిధంగా సాకారమైందో సీఎం జగన్ చూడాలన్నారు. టెక్ మహీంద్ర క్యాంపస్ను సందర్శించాలని ఈ సందర్భంగా సీఎంను గుర్నాని కోరారు. కృత్రిమ మేధస్సుపై సహకరించాలని వీసీ కోరారని.ఏయూతో కలిసి పనిచేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు.