Read also:
ఉచితంగా రూ. 5వేల వరకు స్ర్కాచ్ కార్డులంటూ..
గూగుల్ పే పేరుతో వైరల్ అయిన మెసేజ్లు
అప్రమత్తంగా ఉండాలంటున్న సైబర్ క్రైం పోలీసులు
హైదరాబాద్ సిటీ, డిసెంబర్ 3 (ఆంధ్రజ్యోతి): మీ బ్యాంక్ ఖాతాకు సంబంధించి కేవైసీ వివరాలు అప్లోడ్ చేయండి, గూగుల్ పే వినియోగదారులు లింక్ ఓపెన్ చేస్తే రూ. 500-5000 వరకు స్ర్కాచ్కార్డులు పొందండి.. ఇలా అనేక రకాల గూగుల్ లింక్లు ఫోన్కు మెసేజ్, వాట్సాప్ రూపంలో వస్తున్నాయి. ఇలాంటి లింక్లతో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు సైబర్ క్రైం పోలీసులు.ఇవన్నీ సైబర్ నేరగాళ్లు క్రియేట్ చేసిన మోసపూరితమైన లింక్లని, వాటిని క్లిక్ చేసి వివరాలు నమోదు చేస్తే బ్యాంక్ ఖాతాలోని సొమ్ము కాజేస్తారని పేర్కొన్నారు.
రూ. 5.29 లక్షలు పోగొట్టుకున్న డాక్టర్
సైబరాబాద్ ప్రాంతానికి చెందిన ఓ డాక్టర్కు అక్టోబర్ 21న ఎస్ఎంఎస్ వచ్చింది. ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారం.. వెంటనే మీ కేవైసీ, ఖాతా వివరాలు అప్డేట్ చేయాలి.. లేకపోతే నిలిపివేస్తాం, డెబిట్ కార్డు పనిచేయదు అని దాని సారాంశం. ఆ మెసేజ్తోపాటు గూగుల్ లింక్ పంపారు. డాక్టర్ అనుమానించకుండా గూగుల్ లింక్ ఓపెన్ చేశారు. అందులో వివరాలు నింపారు. అవన్నీ సైబర్ నేరగాళ్లకు చేరాయి. నిమిషాల్లో డాక్టర్ ఖాతాలో ఉన్న రూ. 5.29 లక్షలు కాజేశారు.
వైరల్ అవుతున్న గూగుల్ పే లింక్
మంగళవారం పలు వాట్సాప్ గ్రూపుల్లో గూగుల్ పే లింక్ మెసేజ్ వైరల్గా మారింది. గూగుల్ వినియోగదారులు రూ. 500-5000 వరకు ఉచితంగా స్ర్కాచ్ కార్డులు పొందవచ్చు అనే మేసేజ్తోపాటు గూగుల్ లింక్ ఉంది. వివిధ గ్రూపుల్లో ఉన్న వందలమంది ఆ మెసేజ్ను స్నేహితులకు షేర్ చేశారు. అందులో ఉన్న స్ర్కాచ్ కార్డును ఓపెన్ చేసిన వారికి నగదు ఉన్నట్లు కనిపించింది. డబ్బు మాత్రం ఖాతాలో జమకాలేదు. అది నకిలీ మెసేజ్ అని తెలిసి అందరూ అవాక్కయ్యారు.
ఓపెన్ చేయొద్దు
ఫోన్కు మెసేజ్, వాట్సాప్ రూపంలో వస్తున్న గూగుల్ లింక్లను తొందరపడి ఓపెన్ చేయొద్దు. లింక్ను ఓపెన్ చేస్తే ఫోన్లో ఉన్న పూర్తి డేటా సైబర్ నేరగాళ్ల చేతికి అందే ప్రమాదం ఉంది. బ్యాంక్ ఖాతా, యూపీఐ వివరాలన్నీ సేకరించి ఖాతాలోని డబ్బు కాజేసే ప్రమాదం ఉంది.