Read also:
ఏపీ అసెంబ్లీలో దిశ-2019 బిల్లు.ప్రవేశపెట్టిన హోంమంత్రి
ఏపీ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఏపీ అసెంబ్లీలో దిశ - 2019 బిల్లును ఏపీ హోంమంత్రి సుచరిత ప్రవేశపెట్టారు. ఈసందర్భంగా హోంమంత్రి మాట్లాడుతూ. దిశ బిల్లును ప్రవేశపెట్టే అవకాశం తనకు వచ్చిందని, దిశ ఘటనను సమాజం మొత్తం ఖండించిందన్నారు. మహిళలపై చేయివేస్తే కఠిన శిక్ష అన్నారు. రేప్ లు చేస్తే 20 రోజుల్లో శిక్ష అమలయ్యేలా చట్టం తెస్తున్నామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేస్తామన్నారు. రాష్ట్రంలోని మహిళలకు భరోసాను కల్పించేలా, ఓ అన్నగా జగనన్న మనసులో నుంచి వచ్చిన ఆలోచనే ఈ బిల్లు అని అన్నారు. ఢిల్లీలో నిర్భయ నుంచి హైదరాబాద్ లో దిశ ఘటన వరకూ అన్నీ చూశామని, ఇకపై నిందితులు తప్పించుకుని తిరిగే పరిస్థితి ఏపీలో మాత్రం కనిపించబోదని ఆమె స్పష్టం చేశారు.
ఈ చట్టంలో భాగంగా ప్రతి జిల్లాలో ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఉంటుందని, త్వరితగతిన శిక్షలు విధించడమే కోర్టుల లక్ష్యమవుతుందని తెలిపారు. మహిళల పట్ల సామాజిక మాధ్యమాల్లో, ఫోన్ కాల్స్ లో అసభ్యంగా మాట్లాడినా కేసులు నమోదవుతాయని సుచరిత వ్యాఖ్యానించారు. వారికి రెండేళ్ల కారాగార శిక్షతో పాటు లక్ష రూపాయల జరిమానా పడుతుందని తెలిపారు. శిక్ష పడిన వారు మరోసారి అదే నేరం చేస్తే, నాలుగేళ్ల శిక్ష పడేలా చట్టాన్ని సవరిస్తున్నట్టు పేర్కొన్నారు.