Read also:
వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు
ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ హేమచంద్రారెడ్డి
వచ్చే విద్యా సంవత్సరం నుంచి రాష్ట్రంలో నాలుగేళ్ల డిగ్రీ కోర్సు విధానం అమల్లోకి వస్తుందని ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ కె.హేమచంద్రారెడ్డి తెలిపారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో శనివారం ఆయన మాట్లాడుతూ.. విద్యారంగంలో విప్లవాత్మక మార్పులకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు. మూడేళ్లు డిగ్రీ, ఏడాది అప్రెంటిస్ తప్పనిసరి చేస్తున్నట్లు తెలిపారు. భవిష్యత్తులో ప్రాథమిక, ఇంటర్ విద్యను విలీనం చేస్తామన్నారు. వసతులు, తగినంత మంది విద్యార్థులు ఉన్న ఉన్నత పాఠశాలలను జూనియర్ కళాశాలలుగా మారుస్తామని చెప్పారు. ఒంగోలు ట్రిపుల్ ఐటీకి గత ప్రభుత్వ హయాంలో కేటాయించిన రూ.185 కోట్లను పసుపు- కుంకుమ పథకానికి బదలాయించారని, సంక్రాంతి తర్వాత... ఆ నిధులను తిరిగి కేటాయిస్తామని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి చెప్పినట్లు వెల్లడించారు. టంగుటూరి ప్రకాశం విశ్వవిద్యాలయం ఏర్పాటుకు అవసరమైన చట్టపరమైన ప్రక్రియ పూర్తిచేసి శంకుస్థాపన చేస్తామని సీఎం స్పష్టం చేశారన్నారు. ఇడుపులపాయలో కొనసాగుతున్న ఒంగోలు ట్రిపుల్ ఐటీ విద్యార్థులను త్వరలోనే ఒంగోలుకు తీసుకువస్తామన్నారు. శాశ్వత భవనాల నిర్మాణానికి పామూరు, కందుకూరు సమీపంలోని మాలకొండ వద్ద స్థలాలను అధికారులు పరిశీలించారని, త్వరలోనే దీనిపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.